calender_icon.png 7 October, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్టు

07-10-2025 07:05:16 PM

గత నెల 23న కోదాడలో వదిలివెళ్లిన గంజాయి కేసును చేధించిన కోదాడ పోలీసులు..

వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ..

కోదాడ: ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను కోదాడ పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 23వ తేదీన కోదాడ పట్టణ పరిధి జాతీయ రహదారి వెంబడి సుమారు 110 కేజీల గంజాయిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. దీనిని గుర్తించిన కోదాడ పట్టణ పోలీసులు స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించడం కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. 

సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీ, నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం రోజున కోదాడ పట్టణ పోలీసులు పట్టణ పరిధి జాతీయ రహదారిపై కట్టకొమ్ముగూడెం ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసును గమనించి అనుమానాస్పదంగా పారిపోతున్న కారును వెంబడించి నిందితులు కణం రమేశ్, చాపల అశోక్, చాపల ఎరకమ్మ అలియాస్ రోహిణిలను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేయగా గత నెలలో కోదాడ పట్టణ పరిధిలో 110 కేజీల గంజాయిని వదిలేసి వెళ్లినట్లు ఒప్పుకున్నారు. జిల్లా పోలీసులు విసృత తనిఖీలు చేస్తున్నందున దొరుకుతామనే భయంతో పడివేసి పారిపోయినట్లు ఒప్పుకున్నారు. ప్రతిభ కనపరిచిన కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ శివ శంకర్, ఎస్సై హరిక్రిష్ణ, కోదాడ పట్టణ ఎస్సై హనుమనాయక్, హెడ్ కానిస్టేబుల్ బాల్తు శ్రీనివాస్, కానిస్టేబుల్ యన్.యల్లారెడ్డి, జి.సతీష్, యం.వెంకటేశ్వరులు, కె.రాంబాబు, ఎస్‌కే. ఫరీద్ లను ఎస్పీ అభినందించి, రివార్డుతో సత్కరించారు.