25 February, 2026 | 5:05 AM

గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు

24-02-2026 01:13 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, ఫిబ్రవరి ౨౩ (విజయక్రాంతి): రానున్న గోదావరి నది పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. రాబోయే గోదావరి నది పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. ఇదివరకే సంబంధిత అధికారులు అందరితో, పుష్కరాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించినట్లు వివరించారు.

బాసర  జ్ఞాన సరస్వతి దేవాలయం, పుష్కర ఘాట్ వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున, దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లను చేస్తామని చెప్పారు. ప్రతి పుష్కర ఘాట్ వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఘాట్ ల నిర్మాణం, నీటి వసతి, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ వీసీలో డిపిఓ శ్రీనివాస్, నీటిపారుదల ఈఈ అనిల్, జెడ్పీ సీఈవో గోవింద్, ఈఈ ఆర్ డబ్ల్యుఎస్ సందీప్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.