పొగాకు ఆరోగ్యానికి హానికరం
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ పొగాకు ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 80 లక్షల మంది పొగాకు ఉపయోగించడం వల్ల మరణిస్తున్నారని అదేవిధంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం 13 లక్షల మంది దీని బారిన పడే చనిపోతున్నారని తెలియజేశారు.
ముఖ్యంగా యువత పొగాకు ఉత్పత్తులను వాడకుండా ప్రతి పాఠశాలలోనూ కళాశాలలోనూ అవగాహన కల్పించాలని తెలియజేశారు. పొగాకు ఉత్పత్తులను మానడానికి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కార్యక్రమ నిర్వాహణ అధికారులు డాక్టర్ నయన రెడ్డి, డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ రాకేష్ , డాక్టర్ సౌమ్య , డాక్టర్ సతీష్, డిప్యూటీ జిల్లా విస్తరణ మరియు మీడియా అధికారి బారె రవీందర్ జిల్లాలోని ఆర్బిఎస్కే వైద్యులు తదితరులు పాల్గొన్నారు.






