calender_icon.png 1 July, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రి నగరిలో ట్రాఫిక్ తిప్పలు!

01-07-2025 12:23:34 AM

  1. అసంపూర్తి ఓఆర్బీలతో నిత్యం నరకం
  2. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

వరంగల్/మహబూబాబాద్, జూన్ 30 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా పేరు గడించిన వరంగల్ నగరంలోని కాజీపేట వద్ద రైల్వే ట్రాక్ పై చేపట్టిన ఆర్‌ఓబి నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేశారు. దీనితో వరంగల్, హనుమకొండ, కాజీపేట త్రీనగరి పట్టణాల ప్రజలకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు.

త్రీ నగరి నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు నిత్యం వందల సంఖ్యలో వెళ్లే వాహనాలకు ప్రధాన రహదారిలో కాజీపేట వద్ద ఉన్న ఆర్‌ఓబిని వినియోగిస్తున్నారు. ఈ బ్రిడ్జి పై నుండి నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుండడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో అదనంగా మరో ఆర్‌ఓబి నిర్మించాలని నిర్ణయించారు. ఆ మేరకు ప్రస్తుతం కాజీపేట ఫాతిమా నగర్ వద్ద ఉన్న ఆర్‌ఓబి పక్కనే కొత్తగా ఆర్‌ఓబి నిర్మాణం చేపట్టారు.

కొంతకాలం పాటు స్థల సేకరణ అంశం వల్ల నిర్మాణ పనులు జాప్యం కాగా, తర్వాత సమస్య తొలగిపోవడంతో రైల్వే ట్రాక్ కు ఇరువైపులా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి శాఖ ద్వారా పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. కాంట్రాక్టర్ రైల్వే ట్రాక్ కు ఇరువైపులా ఆర్‌ఓబి నిర్మాణ పనులు దాదాపు పూర్తి చేశారు. ఇక రైల్వే ట్రాక్ పైన వంతెన పనులు పూర్తిచేస్తే ఆర్‌ఓబీ పైన రోడ్డు వేసి రాకపోకలకు అనువుగా మార్చాల్సి ఉంటుంది.

రైల్వే పోర్షన్ లో ఆర్‌ఓబి పనులు ప్రస్తుతం  నత్త నడకన సాగుతున్నట్లు వాహనదారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఇప్పుడున్న ఆర్‌ఓబి పై తరచుగా ప్రమాదాలు సంభవిస్తుండడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని, గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయని చెబుతున్నారు.

వరంగల్ నగరంలో ప్రత్యామ్నా యంగా రైల్వే ట్రాక్ పై ఆర్‌ఓబీలు ఉన్నప్పటికీ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వెళ్లడా నికి ప్రధాన రహదారిగా ఉండడంతో పాటు జనగామ, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వెళ్లే మార్గం ఇదే కావడం వల్ల నిత్యం ఈ బ్రిడ్జి పైనుండే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. నగరం విస్తీర్ణం పెరగడం, వాహనాల సంఖ్య పెరగడం, హైదరాబాదుకు నిత్యం రాకపోకలు సాగించే వారి సంఖ్య ఇటీవల మరింత పెరిగిపోవడంతో రెండో బ్రిడ్జి తప్పనిసరిగా మారింది. అయితే రైల్వే శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించాల్సిన పనుల జాప్యం వల్ల ఆర్‌ఓబి  పనులు పూర్తికాక ఇబ్బందులు తొలగిపోవడం లేదు. 

దర్గా వద్ద ఒక వైపే నిర్మించారు!

ఇక ఎన్‌ఐటి నుంచి కాజీపేట దర్గా మీదుగా బట్టుపల్లి ప్రధాన రహదారిని అనుసంధానించడానికి కాజీపేట- విజయవాడ సెక్షన్ లో రైల్వే ట్రాక్ పై రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించడానికి పనులు చేపట్టారు. అయితే ఎన్‌ఐటి నుండి దర్గా రామాలయం వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరించి ఇవతల వైపు ఆర్‌ఓబి నిర్మాణం చేపట్టి పిల్లర్లు నిర్మించారు.

అయితే ట్రాక్ అవతల వైపు ఎలాంటి పనులు చేపట్టకుండా కేవలం ఒక వైపే పనులు చేపట్టి పిల్లర్లు నిర్మించి వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. సగం ఆర్‌ఓబి పనులు చేపట్టి, మిగిలిన పనులను పట్టించుకోకపోవడం ఏమిటన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్లక్ష్యంగా వదిలేశారని ప్రజలు, వాహనదారులు విమర్శిస్తున్నారు.

ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఫాతిమా నగర్ వద్ద ఆర్‌ఓబి పై రద్దీ తగ్గుతుందని, అక్కడ ఏదైనా ప్రమాదం తలెత్తి ట్రాఫిక్ నిలిచిపోతే ప్రత్యామ్నాయ మార్గంగా దర్గా బ్రిడ్జి ఉపయోగపడుతుందని,  ఆర్‌ఓబి నిర్మాణం త్వరితగ తిన పూర్తి చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం దర్గా వద్ద రైల్వే గేట్ ద్వారా నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుందని, ఆర్‌ఓబి పూర్తిచేస్తే వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా పోతుందని చెబుతున్నారు.