calender_icon.png 25 June, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీడిమెట్ల ఘటనతో ఇనుగుర్తిలో విషాదం

24-06-2025 11:37:29 PM

కూతురు చేతిలో హతమైన సాంస్కృతిక సారధి సభ్యురాలు అంజలి...

మహబూబాబాద్ (విజయక్రాంతి): హైదరాబాదు నగరంలోని జీడిమెట్ల(Jeedimetla Tragedy)లో పదో తరగతి చదువుతున్న బాలిక తన ప్రేమకు అడ్డు చెప్పిందని ఆక్రోశంతో ప్రియుడితో కలిసి తల్లిని చంపిన ఘటన... మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో తీవ్ర విషాదం నెలకొంది. కన్న కూతురి చేతిలో హతమైన తల్లి సట్ల అంజలి పుట్టినిల్లు ఇనుగుర్తిలో కలకలం సృష్టించింది. ఇనుగుర్తికి చెందిన సట్ల ధనమ్మ, మల్లయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు శోభ, అంజలి, జ్యోతి కాగా, తండ్రి మల్లయ్య మరణంతో తల్లి ధనమ్మ కూడా అంజలితో 10 ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ కు వెళ్లిపోయారు.

కరోనా సమయంలో ఒకసారి ధనమ్మ తన కుమార్తె అంజలి మనవరాల్ల కలిసి ఇనుగుర్తికి వచ్చి కరోనా లాక్ డౌన్ తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అంజలి  తెలంగాణ ఉద్యమంలో ధూమ్ దాం కార్యక్రమాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిందని, ఆ తర్వాత ప్రభుత్వం ఆమెకు తెలంగాణ సాంస్కృతిక సారధి బృందం సభ్యురాలిగా ఉద్యోగం ఇచ్చిందన్నారు.  అంజలి సొంత కూతురు చేతిలోనే హతమైందన్న విషయం ఇనుగుర్తిలో దావనంలా వ్యాపించింది. హైదరాబాదులో హత్యకు గురైన అంజలి మృతదేహాన్ని మంగళవారం రాత్రి ఇనుగుర్తికి తీసుకువచ్చారు. 

సాంస్కృతిక సారథి కళాకారిణి అంజలి మృతి పట్ల సంతాపం

తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణి సట్ల అంజలి గత నెల వరకు మహబూబాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహించేదని, ఇటీవల ఆమె మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు బదిలీపై వెళ్లిందని మహబూబాబాద్ డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు. అంజలి మరణ వార్త తెలుసుకొని మంగళవారం రాత్రి జిల్లా సాంస్కృతిక బృందం కళాకారులు, డి పి ఆర్ ఓ ఇనుగుర్తికి చేరుకొని అంజలి భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అంజలి అంత్యక్రియల కోసం ప్రభుత్వం నుండి పదివేల రూపాయలను సహాయంగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక సారధి టీం లీడర్స్ కొమిరే వెంకన్న, గిద్దె రాం నరసయ్య, మెరుగు రవీందర్ గౌడ్, సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షుడు కంబలపల్లి సత్యనారాయణ, బండ వెంకన్న, దర్శనం యుగంధర్, ప్రవీణ్, నరేష్, డప్పు శీను పాషా, ఐలేష్ తదితరులు పాల్గొన్నారు.