28-07-2025 08:14:17 PM
కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై దశలవారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Police Commissioner Gaush Alam) తెలిపారు. సోమవారం నాడు రెండవ బ్యాచ్ కోసం శిక్షణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కమీషనరేట్ కేంద్రంలోని ఐటీ కోర్ కార్యాలయంలో పోలీసులు ఉపయోగించే వివిధ సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లు, సాంకేతిక పరిజ్ఞానంపై ఈ శిక్షణ కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, కమీషనరేట్ వ్యాప్తంగా నూతన కానిస్టేబుళ్లకు ప్రాథమిక శిక్షణతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీపై పట్టు సాధించేలా ఈ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.
ఈ వారం రోజుల శిక్షణలో భాగంగా, పిటిషన్ డ్రాఫ్టింగ్ నుండి ఛార్జిషీట్ దాఖలు వరకు గల విధానాలు, సీసీటీఎన్ఎస్ - 2.0, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఈ-సమన జారీ, అమలు, టీఎస్-కాప్, హెచ్ఆర్ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్ సీఈఐఆర్ సైబర్ క్రైమ్లో ఆర్థిక మరియు ఆర్థికేతర నేరాల గురించి, సీడీఆర్ వంటి అన్ని రకాల సాఫ్ట్వేర్ మరియు అప్లికేషన్లపై సమగ్ర శిక్షణ ఉంటుందని ఆయన వివరించారు. నేరాల ఛేదనలో సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు జి. విజయ కుమార్, వేణుగోపాల్, ఇన్స్పెక్టర్ తిరుపతి ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.