27-10-2025 06:51:07 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..
రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): మద్యం దుకాణాల ఎంపిక లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ 2025–27 సంవత్సరాలకు గాను మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియను జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ లో లాటరీ పద్ధతిలో నిర్వహించారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు మొత్తం 59 మద్యం దుకాణాల ఎంపికకు లాటరీ ప్రక్రియ చేపట్టగా, అందులో 57 దుకాణాలకు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా వీడియోగ్రఫీ మధ్య విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
గెజిట్ నంబర్ 49 చల్వాయి గ్రామం, గెజిట్ నంబర్ 50 గోవిందరావు పేట, ములుగు జిల్లా మద్యం దుకాణాలకు ప్రోహిబిషన్, ఎక్సజ్ కమీషనర్ హైదరాబాద్ వారి ఉత్తర్వులు మేరకు లక్కీ డ్రా తీయడం నిలిపి వేశామని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు వాయిదా వేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా షాపు నెంబర్ 40కు అత్యధికంగా 77 దరఖాస్తులు రాగా, డ్రా ద్వారా 46 నెంబర్ దుకాణం ఎంపికైనట్లు తెలిపారు. డ్రా కార్యక్రమం పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహించబడగా, ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసు అధికారులు, దరఖాస్తు దారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఈ ఎస్ ఎస్ శ్రీనివాస్, డీఎస్పీ సంపత్ రావు, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.