17-06-2025 10:56:29 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి సెక్షన్ సౌత్ బీట్ లో 1149 కంపార్ట్మెంట్ ఫారెస్ట్ భూమిలో అటవీశాఖ అధికారులు భూమి ఆక్రమించకుండా జేసిబితో ట్రెంచ్ పనులు నిర్వహిస్తుండగా ఆ భూమి మాదేనంటూ గిరిజనులు అడ్డుకున్నారు. ట్రెంచ్ పనులు నిర్వహిస్తున్న జేసిబికి అడ్డుగా కొందరు గిరిజన మహిళ రైతులు అడ్డుపడడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏండ్ల తరబడిగా తాము ఆ భూమిని సాగు చేసుకుంటున్నామని, తమకు ప్రభుత్వం నుండి హక్కు పత్రాలు కూడా వచ్చాయని, ఇప్పుడు అటవీశాఖ అధికారులు, డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా వచ్చి ఖండాలు తీయడం సరికాదంటూ గిరిజనులు అడ్డుకున్నారు.
ఆ భూములను స్వాధీనం చేసుకొని మా పొట్ట కొట్టకండి అని వేడుకున్నారు. అవసరమైతే మా ప్రాణాలను వదులుకుంటామని, కందకం తీయకుండా అడ్డుకుంటామని భీష్మించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనస్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపచేశారు. కేసముద్రం ఎస్ఐ మురళీధర్ మాట్లాడుతూ... వివాదాస్పద భూమికి సంబంధించిన ఆధారాలు, అవసరమైన పత్రాలు తీసుకువచ్చి సమర్పించాలని, ఆ తర్వాత రెవెన్యూ శాఖ సర్వే ఆధారంగా భూమి ఎవరిది అనేది నిర్ణయించడం జరుగుతుందని అప్పటివరకు, గొడవకు దిగవద్దని సూచించడంతో తాత్కాలికంగా గొడవ నిలిచిపోయింది.