29-05-2025 02:40:13 AM
- రాజీవ్ గాంధీ నాలెడ్జ్, టెక్నికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో త్రిపుల్ ఐటీ ఏర్పాటు
- ఉమ్మడి పాలమూరుకు వరం ట్రిపుల్ ఐటీ
- సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పర్ణిక రెడ్డి
మహబూబ్ నగర్ మే 28 (విజయ క్రాంతి) : పాలమూరు జిల్లాకు త్రిబుల్ ఐటీ వరించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు రూ.300 కోట్ల వ్యయంతో మహబూబ్ నగర్ జిల్లాకు ఐఐఐటి మంజూరు చేస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నారాయణ పేట ఎమ్మెల్యే డాక్టర్ పర్నికా రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన తెలిపారు.
జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం కావాలని మన ఉమ్మడి జిల్లా తల్లిదండ్రులు ఆశించేవారని, ఉన్నత విద్య కోసం వివిధ ప్రాంతాలకు తమ పిల్లలను పంపించేవారని చెప్పారు. ఈ 75 సంవత్సరాల కాలంలో ప్రప్రథమంగా సీఎం రేవంత్ రెడ్డి కృషితో మహబూబ్ నగర్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఐఐటి కళాశాల రావడం జరిగిందని చెప్పారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామన్నారు.
ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చామని, మా మాటలు నమ్మి ప్రజలు ఓటు వేశారని , ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 5000 కోట్లతో నారాయణ పేట ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. నాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఏర్పాటుచేసిన బాసర ఐఐఐటి లో నేడు 9 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రస్తుతం మహబూబ్ నగర్ కు ఐఐఐటి కళాశాల మంజూరు కావడంతో ఉమ్మడి జిల్లా లోని 14 నియోజకవర్గాలకు చెందిన మెరిట్ విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు.
జడ్చర్ల - మహబూబ్ నగర్ నియోజకవర్గాల మధ్య చిట్టి బోయిన్పల్లి దగ్గర సర్వేనెంబర్ 423/1,423/18,425/1 లో 20.06 ఎకరాలు, జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో సర్వే నెంబర్1/1 లో 21.26 ఎకరాలు మొత్తం 41.32 ఎకరాలలోఐఐఐటి కళాశాల నిర్మాణం చేస్తున్నామన్నారు.
ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మెరిట్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, హైవేస్, రింగ్ రోడ్డు మరే ఇతర అభివృద్ధి పనుల విషయంలో అయినా ముఖ్యమంత్రి ని కలిసి విజ్ఞప్తి చేసినా ఆయన కాదనకుండా అనుమతి ఇస్తున్నారని చెప్పారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సహాకారం కూడా ఉందని ఆయన చెప్పారు. త్రిపుల్ ఐటీ కళాశాలలో ప్రారంభ విద్యా సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మిషన్ లర్నింగ్) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డాటా సైన్స్)కోర్సులలో ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇంత శీఘ్రగతిన ఏ ప్రాజెక్టు రాలేదని, సీఎం చొరవతో ఐఐఐటి కళాశాల మన ఉమ్మడి జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. నారాయణ పేట ఎమ్మెల్యే డాక్టర్ పర్నికా రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తు మేలు జరుగుతుంది అని అన్నారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కృషి వల్లనే ఐఐఐటి కళాశాల ఇంత త్వరితగతిన మంజూరు జరిగింది అని అన్నారు. 14 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులకు మేలు జరుగుతుంది అని అన్నారు. త్వరలో జిల్లా ఎమ్మెల్యేలంతా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతామన్నారు .
ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, సిజె బెనహర్, నాయకులు కృష్ణయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.