19-06-2025 01:25:50 AM
-అమెరికా అధ్యక్షుడితో లంచ్ మీట్లో పాక్ ఆర్మీ చీఫ్
-ఐ లవ్ పాకిస్థాన్ అని వ్యాఖ్యానించిన ట్రంప్
-మోదీ అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసలు
-భారత్ మధ్య యుద్ధం నేనే ఆపానన్న ట్రంప్
వాషింగ్టన్, జూన్ 18: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం లంచ్ మీట్లో పాల్గొన్నారు. అనంతరం వైట్హౌస్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీరు మునీర్తో భేటీ అయ్యారా? అని ట్రంప్కు ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పంది స్తూ.. ‘యుద్ధం ఆపడంలో పాకిస్థాన్ వైపు నుంచి మునీర్ ఎంతో కీలకవ్యక్తి. భారత్ తరఫు నుంచి మోదీ కీలకం.
వారి వల్లే యుద్ధం ఆపగలిగా. భారత్, పాక్ రెండు అణ్వాయుధ దేశాలే. ఆ రెండు దేశాలు యుద్ధంలో పాల్గొన కుండా నేను ఆపాను.’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘భారత్ కాల్పుల విరమణలో మీ పాత్రేం లేదు..’ అని భారత ప్రధాని మోదీ ఫోన్లో చెప్పినా యుద్ధం నేనే ఆపా అని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించడం గమనార్హం.
ఐ లవ్ పాకిస్థాన్
ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఐ లవ్ పాకిస్థాన్. ఇండియా మధ్య యుద్ధం నేనే ఆపా. మోదీ అద్భుతమైన వ్యక్తి. గతరాత్రే ఆయన తో మాట్లాడా. త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం ఉంటుంది. కానీ యుద్ధం మాత్రం నేనే ఆపా.’ అని పేర్కొన్నారు.