27-06-2025 01:15:15 AM
నిజామాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల 29న నిజామాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపా రు. కేంద్ర కార్యాలయం ప్రారంభించిన తర్వాత కేంద్ర పసుపు బోర్డు లోగోను ఆవిష్కరిస్తారని వెల్లడించారు.
నిజామాబాద్ కంటేశ్వర్ బైపాస్ కూడలిలో ధర్మపురి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని అమిత్ షా ఆవి ష్కరిస్తారని, ఆ తర్వాత పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే బహిరంగ రైతుసభలో ప్రసంగిస్తారని తెలిపారు. ఎమర్జెన్సీ డే సందర్భంగా నిజామాబాద్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను గురువారం కిషన్రెడ్డి సందర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కావడం ఇక్కడి పసుపు రైతుల దశాబ్దాల కల అని చెప్పా రు. గతంలో పసుపు బోర్డు ఏర్పాటుపై అనేక రాజకీయ పార్టీలు హామీ ఇచ్చి మోసం చేసినా.. ఈ ప్రాంత రైతుల పట్టుదల, ఎంపీ అర్వింద్ ధర్మపురి కృషి, ప్రధాని మోదీ ఆశీస్సులతో పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని చెప్పారు.
దేశంలో పసుపును పండించే ఇతర రాష్ట్రాలు పసుపు బోర్డును కోరినప్పటికీ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోదీ నిజామాబాదులోనే కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ఇక్కడి రైతులకు గొప్ప బహుమతిని అందించారని చెప్పారు. దేశ వ్యాప్తంగా పసుపు బోర్డు కార్యకలాపాలకు కేంద్రంగా నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు పసుపు క్రయవిక్రయాలను కొనసాగిస్తుందని వెల్లడించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా జిల్లాకు చెందిన రైతు బిడ్డ పల్లె గంగారెడ్డిని నియమించడం మరో విశేషమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిజామాబాద్ పేరు నిలిచిపోతుందని చెప్పారు. ఈ నెల 29న జిల్లా కేంద్రం రైతులతో నిండనుందని, రైతులు స్వచ్ఛందంగా పెద్దఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, సీనియర్ బీజేపీ నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి, మేడపాటి ప్రకాష్ పాల్గొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్య
రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత హేయమైన చర్య అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన దోషులందరికీ శిక్షపడే విధంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఫోన్ ట్యాపింగ్కు గురైందన్న రేవంత్రెడ్డి ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల చేతనే దర్యాప్తు చేయిస్తున్నారని, ఇలా దర్యాప్తు చేయించడం వల్ల దోషులకు శిక్ష ఏవిధంగా పడుతుందని ఆయన ప్రశ్నించారు. రాజకీయ కారణాల వల్లే బీఆర్ఎస్తో కుమ్మక్కైన కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నేరానికి పాల్పడిన తెలంగాణ పోలీసుల చేతనే దర్యాప్తు చేయిస్తే బాధితులకు సరైన న్యాయం జరగదన్నారు.
నేరానికి పాల్పడిన దోషులు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉందన్నారు. ఈ కేసులో దోషులను శిక్షించాలని, చిత్తశుద్ధి ఉంటే సీబీఐకి కేసును అప్పగించాలన్నారు. అన్ని వర్గాల వారి ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడి వారిని బెదిరింపులకు గురిచేసి ఇబ్బందులు పెట్టారని, కోట్ల రూపాయల డబ్బులు దండుకున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు.
పౌరుల హక్కులకు భంగం కలిగిస్తూ అవసరం ఉన్న వారి బాత్రూంలో, బెడ్రూమ్లతోపాటు వ్యక్తిగత సమాచారానికై ట్యాపింగ్ చేశారన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. న్యాయస్థానం ఆదేశంతో సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.