14-06-2025 12:55:38 AM
చర్ల,(విజయక్రాంతి): జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరే టిడబ్ల్యూజేఎఫ్ కమిటీ జూలై 12,13 తేదీలలో భద్రాచలం పట్టణంలో టిడబ్ల్యూజేఎఫ్ తృతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ కర్ర అనిల్ రెడ్డి అన్నారు. శుక్రవారం చర్ల మండల కేంద్రంలో జరిగిన తృతీయ మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించే తృతీయ మహాసభల సందర్భంగా 12వ తేదీన జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక జర్నలిస్ట్ యూనియన్ టిడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనన్నారు. టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి జర్నలిస్టులకు అండగా నిలిచి జర్నలిస్టుల హక్కులను సాధించిందన్నారు. భద్రాచలంలో ఘనంగా నిర్వహించనున్న తృతీయ మహాసభల విజయవంతనికి యూనియన్ సభ్యులతో పాటు, ప్రతి ఒక్కరు తమ వంతుగా సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలన్నారు.