14-06-2025 12:55:38 AM
మావోయిస్టు వ్యతిరేక ర్యాలీయే కారణమా?
హుస్నాబాద్, జూన్ 13: మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలో దాడి జరిగింది. ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగింది. తీవ్ర గాయాలపాలైన ఆదిత్య ప్రస్తుతం కరీంనగర్లోని సన్రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత సోమవారం, ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య ఆధ్వర్యంలో నక్సలైట్లు ఆయుధాలు విడిచిపెట్టి జనజీవనంలో కలవాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎస్ఐ జాన్ విల్సన్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. గురువారం రాత్రి ఆదిత్య హుస్నాబాద్ సమీపంలోని పొట్లపల్లి రోడ్డులో ఉన్న తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు.
అక్కడ గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ‘నక్సలైట్లు కుక్కలారా.. లుచ్చగాళ్లారా.. ర్యాలీ ఎందుకు తీశావురా‘ అంటూ ఆదిత్యపై దాడికి తెగబడ్డారని ఏబీవీపీ నాయకుడు రాకేశ్ వెల్లడించారు. దుండగులు ముందుగా ఆదిత్య కాళ్లపై కొట్టి కిందపడేశారని, ఆపై కడుపులో బీరు సీసాలతో పొడిచారని, ఏదో పదునైన ఆయుధంతో తలపై బాదారని తెలిపారు.
అదే సమయంలో అటుగా ఒక బైకు వస్తున్న శబ్దం కావడంతో దుండగులు ఆదిత్యను వదిలేసి పారిపోయారని రాకేశ్ వివరించారు. గ్రామస్తులు వెంటనే సమాచారం అందించడంతో ఆదిత్యను హుస్నాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని సన్రైజ్ ఆసుపత్రికి తరలించారు.
ఇక్కడ నక్సలైట్లెవరున్నరు?
ఏబీవీపీ నాయకుడు ఆదిత్యపై జరిగిన దాడిపై విచారణ జరుపుతున్నాం. ఆయన నక్సలైట్లకు వ్యతిరేకంగా ర్యాలీ చేయడంతోనే దాడి చేశారని, తాము కమ్యూనిస్టులమంటూ కొట్టారని అంటున్నారు. ఈరోజుల్లో ఇక్కడ నక్సలైట్లెవరున్నరు.
ఆయనపై వ్యక్తిగతంగా ఏదైనా కక్షలు పెట్టుకొని ఆయన శత్రువులు ఎవరైనా ఈ దాడికి పాల్పడ్డారా.. ఇంకెవరైనా చేశారా అని దర్యాప్తు చేస్తున్నాం. దాడి జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం.
సదానందం, ఏసీపీ, హుస్నాబాద్