24-04-2025 01:31:44 AM
కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్23: కరీంనగర్ కమిషనరేట్ కొత్తపల్లి పోలీసులు, కన్నపు దొంగతనాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన, అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
గత సంవత్సరం జూలై నెలలో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరుపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటిలో చొరబడి 2,25,000 విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించబడ్డాయి. అదేవిధంగా, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ రోడ్డు, పివిఆర్ గార్డెన్స్ సమీపంలో కే రాజేంద్రప్రసాద్ ఇంటి తాళాలు పగలగొట్టి మద్యం సీసాలతో పాటు హీరో హోండా మోటార్ సైకిల్ను అపహరించారు.
ఈ ఘటనలపై సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ రూరల్ మరియు కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ ఆదేశాల మేరకు, రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ఐపీఎస్ పర్యవేక్షణలో, కొత్తపల్లి ఎస్ హెచ్ ఓ (ట్రైనింగ్ ఐపీఎస్) వసుంధర మార్గదర్శకత్వంలో విచారణ ముమ్మరంగా సాగింది.
ఈ సందర్భంగా రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ఐపీఎస్ మాట్లాడుతూ, దర్యాప్తులో నిందితులు మధ్యప్రదేశ్ రాష్ట్రం, ధార్ జిల్లాకు చెందిన ప్రదీప్ (29), విక్రమ్, హత్రు సింగ్ (41), మరియు జితేన్ గా గుర్తించబడ్డారని తెలిపారు. వీరిపై కొత్తపల్లి మరియు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదు చేయబడ్డాయి. ప్రధాన నిందితుడైన ప్రదీప్ను గత మార్చి నెలలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఆయన వెల్లడించారు.
ఈ కేసులో మరో నిందితుడైన హత్రుసింగ్ (41)మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా నరవాలిలో ఉన్నాడని సమాచారం రావడంతో, కొత్తపల్లి ఎస్త్స్ర సాంబమూర్తి మరియు సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి మంగళవారం అతడిని అరెస్టు చేసి కరీంనగర్కు తీసుకువచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. కాగా, మరో ఇద్దరు నిందితులు విక్రమ్ మరియు మరొక ప్రదీప్ ఇంకా పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రూరల్ ఏసిపి శుభం ప్రకాష్ తెలిపారు.