11-06-2025 12:00:00 AM
పీసీసీ ఉపాధ్యక్ష పదవిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి వ్యంగ్యాస్త్రాలు
హనుమకొండ, జూన్ 10 (విజయక్రాంతి): “అమ్మో.. అంత పెద్ద పదవి నేను నిర్వహించలేను. ఇంకెవరికైనా ఇవ్వండి. ఎమ్మెల్యే పదవి చాలు నాకు” అంటూ పీసీసీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించడిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పార్టీ అధిష్ఠానంపై వ్యంగ్యాస్త్రాలు చేశారు. సోమవారం ప్రకటించిన పీసీసీ కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా నాయిని రాజేందర్రెడ్డిని అధిష్ఠానం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో నాయిని రాజేందర్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అనేక పర్యాయాలు ఇతరుల కోసం పదవి త్యాగం చేసిన తనకు చివరకు కీలకమైన పదవి కాకుండా కేవలం నామ్ కి వాస్తేగా ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల కినుక వహిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఉపాధ్యక్ష పదవి పట్ల తనకు ఏమాత్రం ఇష్టం లేదని, ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లనున్నట్లు రాజేందర్రెడ్డి తెలిపారు.