06-10-2025 12:37:23 AM
మహిళలతోనూ దురుసు ప్రవర్తన
ఈవోకు ఫిర్యాదు చేసిన బాధితులు
పాపన్నపేట, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులు దోపిడీకి గురవుతున్నారు.భక్తులు ఏడుపాయల క్షేత్రంలోకి ప్రవేశించిన వెంటనే దోపిడీ మొదలవుతోంది. ఒడి బియ్యంతో మొదలు పెడితే చిన్న నీళ్ల సీసా వరకు భక్తులను దోచుకుంటున్నారన్న ఆరోపణలు భక్తుల నుంచి వస్తున్నాయి. ఆలయం చెంతనే ఉన్న దుకాణాల్లో ప్రతి వస్తువుపై అదనంగా వసూలు చేస్తున్నారు.
ఒక్కో వస్తువుపై రూ.10 నుంచి రూ.20 వసూలు చేస్తూ భక్తులను దోపిడీ చేస్తున్నారు. భక్తుల మొక్కుల విషయంలో ఈ దోపిడీ కొనసాగుతున్నది.కష్టాలు తీర్చితే నిలువు దోపిడీ ఇస్తామని తమ ఇష్ట దైవమై న వనదుర్గామాతకు భక్తులు మొక్కుకుంటారు. ఆ శ్రమ మీకేం అవసరం లేదు.. క్షేత్రానికి వస్తే మిమ్మల్ని మేమే దోచుకుంటామని ప్రతిన పూనుతున్నారు కొందరు గుత్తేదారులు.
అమ్మవారికి సమర్పించే మొక్కులకు సంబంధించి ఆలయం ఇచ్చే రసీదు తీసుకున్నా.. గుత్తేదారులు వారి చేతికి కొంత సొమ్ము ముట్టజెప్పాలని భక్తులను డిమాండ్ చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా వారితో సైతం దురుసుగా ప్రవర్తించి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. దీంతో ఆల యానికి వచ్చిన భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఏడుపాయలకు రావాలంటేనే దోపిడీకి గురవుతామేమోనని భయాందోళనకు గురవుతున్నారు ఏడుపాయల వనదుర్గా మాత పుణ్యక్షేత్రంలో భక్తుల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని భక్తులు ఆరోపిస్తున్నారు. వెల్మకన్నెకు చెందిన రాజేందర్ గ్రామస్తులతో కలిసి ఆదివారం వనదుర్గమ్మకు ఒడి బియ్యం సమర్పించారు. ఒడి బియ్యం పోసేందుకు కావలసిన ఆలయ రసీదును రూ.50 చెల్లించి తీసుకున్నాడు.
అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించినా అనంతరం అక్కడే ఉన్న గుత్తేదారు నాగ్సన్పల్లికి చెందిన జీవన్ రెడ్డి సదరు మహిళను ఒడి బియ్యం కట్నం అడగగా ఆమె రూ.50 తీసి ఇచ్చింది. అవి సరిపోవు రూ.100 చెల్లించాల్సిందేనని ఆమెతో దురుసుగా ప్రవ ర్తించాడని సదరు గ్రామస్తులు ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆలయ ఈవో చంద్రశేఖర్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.