అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు
టెహ్రాన్: పాకిస్థాన్ వేదికగా అమెరికా, ఇరాన్ శాంతి(US Iran Peace Talks) చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇవాళ చర్చలు ప్రారంభం కావాల్సి ఉన్నా ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇరు దేశాల ప్రతినిధుల రాకపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో భేటీపై అనిశ్చితి నెలకొంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
ఫిబ్రవరి 28 నుండి మధ్యప్రాచ్యంలో ఇరాన్, అమెరికా పక్షాల మధ్య కొనసాగుతున్న తీవ్ర పోరుకు రెండు వారాల విరామం లభించిన నేపథ్యంలో ఈ వారాంతంలో పాకిస్తాన్లో ఇరు దేశాల మధ్య చర్చలకు రంగం సిద్ధమైంది. హోర్ముజ్ జలసంధి ప్రతిష్టంభన, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి కారణంగా కాల్పుల విరమణ ఒప్పందం పెళుసుగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది.
లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు
లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లైబనాన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. బీరుట్ దక్షిణ శివారుల్లోని ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ సైన్యం, వారి స్థావరాలపై హెజ్ బొల్లా ప్రతిదాడులు చేస్తోంది.




