09-06-2025 08:28:26 PM
రూ.250 కోట్లతో కోదాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు..
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..
కోదాడ: పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) అన్నారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు రైన్ కోట్లు, గ్లౌజులు, దుస్తులు పంపిణీ చేసి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంపులు నిర్వహించి అవసరమైన వారికి చికిత్సలు అందించాలన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వంద రోజుల కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. కాలువలు వీధిలో చెత్తాచెదారాలు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కోదాడలో రూ.250 కోట్లతో త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.