26-06-2025 12:54:24 AM
కామారెడ్డి, జూన్ 25,(విజయక్రాంతి): ఈ ఏడాది ముందు మురిపించిన వర్ణుడు ప్రస్తుతం ముఖం చాటేస్తున్నాడు. నిత్యం మేఘాలవుతున్న వర్షాలు మాత్రం కురవడం లేదు. దీంతో ముందుగా కురిసిన వర్షాలకు విత్తనాలు నాటిన రైతులు ఆందోళన చెందుతున్నారు. తికమకగా మొలకలు మొలుస్తుండడంతో మొలకలకు సరిపడా నీరు లేకపోవడంతో బయట నుంచి నీరు తీసుకువచ్చి రైతులు మొక్క మొక్కకు నీరు పోస్తున్నారు.
మరికొన్ని మొలకలు మొలవకపోవడంతో మరోసారి విత్తనాలు నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అసలే విత్తనాల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో దుక్కి దున్ని విత్తనాలు వేసిన రైతులకు వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో మొలకలు సరిగా మొలవక కామారెడ్డి జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు నాటని రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
దుక్కులు దున్ని సిద్ధం చేసిన రైతులు వర్షం కురిస్తే విత్తనా లు నాటాలని భావిస్తున్న రైతులకు వర్ణుడు ముఖం చాటేస్తుండడంతో రైతులు విత్తనాలు నాటే సమయం దాటి పోతుందని ఆందోళన చెందుతున్నారు. ముందు కురిసిన వర్షానికి విత్తనాలు నాటిన రైతులకు విత్తనాలు సరిగా మలవక మొలకలు తికమక ఉండడంతో మొలకల వద్ద నీరు పోస్తూ రక్షించుకునే ప్రయత్నం రైతులు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి, రామేశ్వర్ పల్లి, పెద్ద మల్లారెడ్డి, ర్యాగట్లపల్లి, అంతం పల్లి గ్రామాల్లో రైతులు ముందుగా విత్తనాలు నాటారు. వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు నాటి సమయం దాటిపోతుందని మొలకలు సరిగా మొలవక దిగుబడి తక్కువ వస్తుందని రైతులు అంటున్నారు.
రైతులకు తప్పని కష్టాలు:
రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. ఓవైపు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వాలతో పోరాడుతున్న అన్నదాతకు వరుణుడు సైతం సహకరించడం లేదు. సకాలంలో వర్షాలు కూడా కురవకపోవడంతో కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారు. మిరుగు నుంచి చుక్క చినుకు రాక రైతన్నలు ఆకాశం వైపు చూస్తూ వరుణ దేవుడా కరుణించు అని వేడుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తయిన తర్వాత ఖరీఫ్ పంట సాగుపై రైతులు బిజీగా ఉన్నారు. వర్షాకాలం కంటే ముందు జోరుగా కురిసిన వర్షాలకు ఈ యేడు నీటి పంటలకు ఉండదని భావించిన రైతులకు , వర్షాలు సమృద్ధిగా పడతాయని ఆశతో దుక్కులు దున్ని అన్ని సిద్ధం చేసుకున్నారు. పంట సాగు చేసుకోవడానికి విత్తనాలు విత్తుకున్నారు. పలు చోట్ల వరినారు సైతం వేశారు. తీరా వర్షాలు పడే సమయానికి వరుణుడు ముఖం చాటేశాడు. మిరుగు తర్వాత కురావాల్సిన వర్షాలు ఇప్పటికి జాడ లేదు. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.
వెయ్యికళ్లతో ఎదురుచూపులు..
రబీలో అకాల వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అన్నదాతలు పంట చివరి వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వచ్చింది. కాగా.. ఈ సీజన్లో రుతుపవనాలు ముందే వచ్చాయని భావించిన రైతులకు నిరాశే మిగులుతోంది. వర్షం ఎప్పుడు పడుతుందా.. ఎప్పుడు పంట మొలకెత్తుతుందా అని రైతన్నలు ఎదురుచూస్తున్నారు.
ట్యాంకర్లతో నీటి సరఫరా
గత రబీలో సరైన సమయంలో పంటకు నీరందక ఎండిపోయే దశలో కొంతమంది రైతులు ట్యాంకర్ల ద్వారా పంటకు నీరు పారిస్తున్నారు. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. ఎండిపోతున్న మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీరు తెప్పించి నీటిని పంటలకు అందిస్తున్నారు. అసలే పంట పెట్టుబడికి ఇబ్బందులు పడ్డ తమకు ప్రస్తుతం ట్యాంకర్ ఖర్చు అదనపు భారంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే తప్ప పంట గట్టెక్కే పరిస్థితి లేదని చెబుతున్నారు. జిల్లాలో ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే అంచనా కంటే మరింత పంటలు పెరుగుతాయని రైతులు అంటున్నారు.
వర్ణుడు పైనే భారం వేసుకున్న రైతులు
కామారెడ్డి జిల్లాలో వర్షాకాలం సీజన్లో పంటలు వేసేందుకు వరుణుడి కరుణ పైనే ఆధారపడి పంటలు సాగు చేస్తారు. మెట్ట మొక్కజొన్న పంట పండిస్తారు. పత్తి, మొక్కజొన్న, సోయా వంటి పంటలు వేసి పంటలు సాగు చేస్తారు. వర్ణుడు కరుణించకపోవడంతో విత్తనాలు నాటేందుకు రైతులు వెనుక ముందు ఆలోచిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భావించిన రైతులకు ముందు మురిపించి న వర్ణుడు ప్రస్తుతం ముఖం చాటేస్తుండడంతో ఆకాశం వైపు వరుణుని కర్ణ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
ట్యాంకర్కు బాగా ఖర్చవుతోంది
వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మొక్కజొన్న పంట వేశాను. 15 రోజుల నుంచి చుక్క వర్షం లేదు. మొక్కజొన్న పంట మొత్తం ఎండిపోతుంది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి నుంచి ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి పంటకు పారిస్తున్నాను. ట్యాంకర్కు రోజుకు రూ. 1,000 ఖర్చు అవుతుంది. వర్షం సకాలంలో పడితే అదనపు ఖర్చు భారం ఉండదు.
- ఆముదాల రమేష్, రైతు,
రాజంపేట, కామారెడ్డి జిల్లా
సమయం దాటిపోలేదు
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వర్షాలు పడగానే రైతులు విత్తనాలు నాటుకోవాలి. ప్రస్తుతం ముందుగా కురిసిన వర్షాలకు విత్తనాలు నాటిన రైతులకు మొలకలు పెరగడంతో వాటిని రక్షించుకునేందుకు నీరు తెచ్చి మొక్కలకు పోస్తున్నారు. కాలం ముందు ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- తిరుమల ప్రసాద్,
జిల్లా వ్యవసాయ శాఖ,
జాయింట్ డైరెక్టర్, కామారెడ్డి.