19-02-2026 02:09:47 AM
ప్రారంభించిన టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
కొండాపూర్, ఫిబ్రవరి 18: కొండాపూర్ మండలం మాల్కాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ను బుధవారం టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. గ్రామంలో ప్రత్యేకంగా ప్రతీ బుధవారం కూరగాయల మార్కెట్ నిర్వహించేలా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
కూరగాయల మార్కెట్ లో తిరుగుతూ పలువురు కూరగాయల అమ్మే మహిళలతో నిర్మల జగ్గారెడ్డి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేకంగా బుధవారం రోజున కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. మాల్కాపూర్ గ్రామంలో మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా నాలుగు భవనాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే రెండు భవనాలు పూర్తి అయ్యాయని, మరో రెండు భవనాలు త్వరలో సిద్దం అవుతాయని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, త్వరలో నే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల్కాపూర్ గ్రామ సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ ప్రవీణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అలవేని నర్సింహ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.