calender_icon.png 18 June, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం..

18-06-2025 06:46:44 PM

అభయ మిత్ర అవగాహన కార్యక్రమంలో వెంకటాపురం సీఐ బండారి కుమార్..

వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): పోలీస్ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని వెంకటాపురం సీఐ బండారి కుమార్(CI Bandari Kumar) పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆర్ అండ్ విగ్రహం ఆవరణలో జరిగిన అభయ మిత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ములుగు జిల్లా ఎస్పీ, ఏటురునాగారం ఏఎస్పీ  ఆదేశాల మేరకు అభయ మిత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ప్రజల భద్రతకి రక్షణ కల్పించే చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి తద్వార నేర రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. పోలీసులకు, ప్రజల మధ్య సత్సంబంధాలు పెంపొందించేలా కృషి చేస్తామన్నారు. నిషేధిత మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ, యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని, అందుకు వారి తల్లిదండ్రులు దృష్టి సారించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని తెలిపారు. డ్రగ్స్ ని అదుపు చేసే దృష్ట్యా ప్రతి గ్రామంలో ఆంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, డ్రగ్స్ గురించిన సమాచారం తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. 

గ్రామస్తులు, రైతులు తమ పంట పొలాల రక్షణకై పొలాల చుట్టూ అక్రమంగా ఏర్పాటు చేసే కరెంట్ పెన్సింగ్ వలన ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదేవిధంగా ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని, సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పరిరక్షణకై పిల్లలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. సామాజిక మాధ్యమాలలో కనిపించే లోన్ అప్లికేషన్ యాప్ ల లోన్లు తీసుకోరాదని హెచ్చరించారు.

గుర్తుతెలియని వ్యక్తుల కాల్స్ లిఫ్ట్ చేసి వ్యక్తిగత వివరాలను, మీ బ్యాంకు ఖాతా వివరాలు చెప్పరాదని తెలియజేశారు. ముఖ్యంగా జూదం, క్రికెట్ బెట్టింగ్ లాంటి వాటికి బానిస కారాదని, అవి ఆర్థికంగా కుటుంబాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. రైతులు నకిలీ విత్తనాల గురించి అవగాహన కలిగి ఉండాలని, లైసెన్స్ లేకుండా విత్తనాలను విక్రయించే వారి వద్ద కొనుగోలు చేయరాదని, విత్తనాల కొనుగోలు, వ్యవసాయ అభివృద్ధి కొరకు ఉపయోగించే పెస్టిసైడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రానున్నది వర్షాకాలమైనందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధిక వర్షపాతం నమోదయ్య సమయంలో వారి యొక్క పరిస్థితులను పోలీసులకు తెలియజేస్తూ, రహదారులు వంతెనలు కల్వర్టులు ముంపు గురైనప్పుడు వాటిని ఎవరు సాహసించి దాటరాదని సూచించారు. 

ముఖ్యంగా వెంకటాపురం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తమ తమ గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దీనివలన అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా దొంగతనాలు దోపిడీలు వంటి నేరాలను నిరోధించడం వీలవుతుందని వివరించారు. రోడ్డు భద్రత అవగాహన కల్పించే దృష్ట్యా ద్విచక్ర వాహన దారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, వాహన పత్రాలు కలిగి ఉండాలని, మైనర్లకు వాహనం ఇవ్వరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎస్.ఐ - కె. తిరుపతిరావు, శిక్షణ ఎస్.ఐ- ఎమ్. సాయి కృష్ణ, పోలీస్ సిబ్బంది, వెంకటాపురం మండలంలోని అన్ని గ్రామాలలో ఏర్పాటుచేసిన యాంటీ డ్రగ్ కమిటీలలో పనిచేస్తున్న సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.