24-04-2025 01:46:23 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): పట్టుబట్టి ఐపీఎస్ సాధించినా ఆయనలో ఇంకా ఏదో సాధించాలనే తపన అలానే ఉంది. దీంతో ఓ వైపు ఐపీఎస్గా విధులు నిర్వర్తిస్తూనే, తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 46వ ర్యాంక్ తో ఐఏఎస్ సాధించారు మహబూబాబాద్ జిల్లా కాట్రపల్లికి చెందిన జయసింహారెడ్డి. హనుమకొండలో నివాసముంటున్న వ్యవసాయ శాస్త్రవేత్త రావు, ఉమారెడ్డిల కొడుకే జయసింహారెడ్డి. ఈయన చిన్నతనం నుంచే చదువులో మంచి ప్రతిభ కనబరిచేవారు. ఐఐటీ హైదరాబాద్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్కు ప్రిపేరయ్యి మూడో ప్రయత్నంలో 227 ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపియ్యారు. ప్రస్తుతం పశ్చిమబెం గాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ తాను ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో పట్టువదులకుండా ప్రయత్నించి నాలుగో ప్రయత్నంలో ఆలిండియా స్థాయిలో 104 ర్యాంకు సాధించగా మళ్లీ ఐపీఎస్ వచ్చింది.
నిరాశ పడకుండా తిరిగి పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నించి ఐదోసారి ఆలిండియా స్థాయిలో 46వ ర్యాంక్తో ఐఏఎస్ సాధించి ఈసారి తన లక్ష్యాన్ని అందిపుచ్చుకున్నారు. లక్ష్యం కోసం కఠోర శ్రమపడిన జయ సింహారెడ్డిని, విజయ సింహారెడ్డి అంటూ అంతా వేనోళ్ల పొగుడుతున్నారు.