02-06-2025 03:32:43 PM
కరీంనగర్,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు ఉమేష్ కుమార్ జాతీయ పతాకం ఎగరవేసారు. తెలంగాణ రాష్ట్ర గీతం, జాతీయ గీత ఆలాపన అనంతరం ఉపకులపతి విశ్వవిద్యాలయ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవాలంటే మనమంతా శాయశక్తుల కృషి చేయాలని మనకున్న వనరులను వినియోగించుకొని కష్టపడి పనిచేయాలి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలలో చదువు ప్రాముఖ్యతను పెంచాలని, సిబ్బంది శ్రద్ధతో, ఆసక్తితో పనిచేసి శాతవాహన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలోనే అన్ని విశ్వవిద్యాలయాల కన్నా ముందు వరుసలో నిలపాలని కోరుతూ విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సులు ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.
న్యాయ కళాశాలకు విశ్వవిద్యాలయంలో భవన నిర్మాణం చేస్తామని, అన్ని కళాశాలలలో సెమినార్ హాల్లను పునర్ నిర్మించి రాష్ట్రంలో ఏ ఇతర విశ్వవిద్యాలయానికి కూడా మంజూరు కానీ పార్ట్ టైం అధ్యాపక పోస్టులను మన యూనివర్సిటీకి మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశం ముందుకు సాగాలంటే రాష్ట్రాలు ముందంజలో ఉండాలని, రాష్ట్రాలు ముందంజలో ఉండాలంటే రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలని అలాగే విశ్వవిద్యాలయంలోని సిబ్బంది క్రమశిక్షణతో నడుచుకోవాలని ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమే మన ఈ తెలంగాణ అని దానిని మనము అభివృద్ధి చేసుకోవడమే వారి త్యాగాలకు మనం ఇచ్చే గౌరవమన్నారు. ఈ రాష్ట్ర అవతరణ వేడుకలలో ఉపకులపతితో పాటు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య జాస్థి రవికుమార్, ఓ ఎస్ డి టు విసి డా. హరికాంత్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుజాత, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. జయంతి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డా. శ్రీశైలం, గోదావరిఖని పీజీ కళాశాల ప్రిన్సిపల్ రమాకాంత్, పరీక్షల నియంత్రణ అధికారి డా.సురేష్ కుమార్ వివిధ విభాగాల శాఖధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.