29-12-2025 08:29:56 PM
హనుమకొండ,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్న వికసిత్ భారత్ జీ రాం జీ 2025 పథకం గ్రామీణాభివృద్ధికి కీలకంగా నిలవనుందని కమలాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పబ్బు సతీష్ అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పేరుకుపోయిన అనేక సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆర్థికంగా గ్రామాలు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.
గతంలో అమలులో ఉన్న ఉపాధి హామీ పథకంలో ఉన్న విధానపరమైన లోపాలను సవరించి వాటికి పరిష్కారంగా జీరాంజీ 2025 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అభినందనీయమని సర్పంచ్ తెలిపారు. ఇప్పటివరకు ఉపాధి హామీ పథకంలో వంద పని దినాలకే పరిమితమైన అవకాశాన్ని నూతన పథకం ద్వారా 125 పని దినాలుగా పెంచడంతో పాటు వేతనాలను కూడా పెంచడం గ్రామీణ కార్మికులకు ఎంతో ఊరటనిస్తుందన్నారు. ఇది గ్రామీణ నిరుద్యోగ సమస్యను గణనీయంగా తగ్గించే దిశగా కీలక అడుగుగా అభివర్ణించారు.
అలాగే ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉండటం మరింత శుభపరిణామమని చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధి హామీ నిధులను సక్రమంగా పర్యవేక్షించకపోవడం సరైన వినియోగం జరగకపోవడం వల్ల నిధుల దుర్వినియోగం జరిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. అయితే ప్రస్తుతం నూతన పథకంలో 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యత పెరుగుతుందని దాంతో పనుల్లో పారదర్శకత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గతంలో చోటుచేసుకున్న లోపాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని ప్రజలకు కేటాయించిన నిధులు నిజంగా ప్రజలకే ఉపయోగపడేలా వినియోగం జరిగే అవకాశం ఉందన్నారు. మొత్తంగా వికసిత్ భారత్ జీ రాం జీ పథకం ద్వారా గ్రామాలకు సమగ్ర అభివృద్ధి జరిగే అవకాశముందని ప్రజలకు నేరుగా మేలు చేకూరుతుందని సర్పంచ్ పబ్బు సతీష్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా బిజెపి అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు, నాయకులు మార్క అశోక్, కీర్తిన ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.