calender_icon.png 28 June, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగులో వ్యర్థ జలాల పారబోత.. అడ్డుకున్న గ్రామస్తులు

28-06-2025 01:04:16 AM

మేడ్చల్ అర్బన్, జూన్ 27:మేడ్చల్ నుండి శామీర్ పేటకి వెళ్లే వాగులో పూడూరు శివారు వద్ద శుక్రవారం సెప్టిక్ ట్యాంక్ వ్యర్థ జలాలు వదులుతున్న వాహనాన్ని గ్రామానికి చెందిన మత్స్యకారులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు.అనంతరం మున్సిపల్,పోలీస్,పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా అధికారి రాజేందర్ కు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి వచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు వాగులోని నీటి శాంపిల్స్ ను సేకరించి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థ పదార్థాలుగా నిర్ధారించి మున్సిపల్ అధికారులకు అప్పగించారు.కాగా మున్సిపల్ కమిషనర్ చంద్ర ప్రకాష్ అక్రమంగా వాగులోకి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థ పదార్థాలు వదులుతున్న వాహన నిర్వాహకులకు రూ.5వేలు పెనాల్టీ వేసి వాహనాన్ని వదిలిపెట్టారు.

ఈ సందర్భంగా పూడూరు గ్రామ పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ మున్సిపాలిటీ అధికారులు తూతూ మంత్రంగా పెనాల్టీలు వేసి చేతులు దులుపుకొని వాహనాలను వదిలిపెట్టకుండా  పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సదరు వాహనానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు పేరు ఏర్పాటు చేసుకొని సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధ జలాల తరలింపు దందా చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై వాటర్ బోర్డ్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.యదేచ్చగా వాగులోకి సెప్టిక్ ట్యాంక్,పారిశ్రామిక వ్యర్థ జలాలు,మురుగు నీరు వదలడం వల్ల మత్స్య సంపదకు తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా మున్సిపల్,మత్స్యశాఖ,పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు మేడ్చల్ నుండి శామీర్ పేట్ వెళ్లే వాగులోకి వ్యర్థ జలాలు వదలకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మత్స్యకారులు నీరుడి శ్రీరామ్,మర్రిచెట్టు మల్లేష్,నీరుడి శ్రీకాంత్,సాయి,చంద్రయ్య,మున్సిపల్ సిబ్బంది మహేందర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,సుధాకర్ తదితరులు ఉన్నారు.