calender_icon.png 4 October, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాజాపూర్ గ్రామంలో నీటి కష్టాలపై ఆందోళనకు దిగిన గ్రామస్తులు

04-10-2025 05:23:39 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని ఖాజాపూర్ గ్రామంలో నీటి కష్టాలు చుట్టుముట్టాయి. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడం, మంచినీటి పథకం బోర్లు పనిచేయకపోవడంతో శనివారం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాంకర్ల సరఫరా కూడా సరిగా జరగడం లేదని గ్రామస్థులు అధికారులను నిలదీశారు. పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మదన్ స్థానిక గ్రామ పంచాయతీకి వచ్చారు. నీటి సమస్యపై పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి పనితీరు వ్యవహారంపై గ్రామస్తులు మండి పడుతూ... రెవెన్యూ ఇన్స్పెక్టర్ మదన్ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో దురుసుగా వ్యవహరించి, పరిష్కారానికి నిర్లక్ష్యం చేసిన పంచాయతీ కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.

కోపోద్రిక్తులైన స్థానికులు అధికారులను చుట్టుముట్టడంతో సమాచారం తెలుసుకున్న సిర్గాపూర్ ఎస్సె మహేష్ జోక్యం చేసుకొని గ్రామస్తులకు నచ్చ చెప్పారు. అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి మహిళలు ఖాళీ బిందెలు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని గ్రామ నీటి పథకం బోర్లు ఏ ఒక్కటి పనిచేయ్యడం లేదని, మిషన్ భగీరథ నీటి సరఫరా అసలే లేదని మహిళలు ఆ విధంగా తెలిపారు. వెంటనే నీటి సరఫరాకు చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటానని కార్యదర్శి వెంకటేష్ తెలపడంతో ప్రజలు శాంతించారు. అప్పుడే గ్రామంలో కొత్త సింగిల్ ఫేజ్ మోటార్ను బిగించి నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు.