బస్సులు ఆపాలంటూ గ్రామస్తుల ధర్నా
వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ అర్బన్ మండలం, అగ్రహారం సమీపంలోని గుర్రంవానిపల్లి స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని ఆరోపిస్తూ మహిళలు, వృద్ధులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్యాడీ లోడ్ల తనిఖీల కోసం వెళ్తున్న జిల్లా రవాణా శాఖ అధికారి దేవనూరి శ్రీనివాస్ ధర్నాలో చిక్కుకున్నారు. గ్రామస్తుల సమస్యను తెలుసుకున్న ఆయన, బస్సుల నిలుపుదల అంశంపై పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డి, గ్రామస్తులతో చర్చించి ధర్నాను విరమింపజేశారు. అలాగే వేములవాడ, సిరిసిల్ల ఆర్టీసీ డిపోల డిపో మేనేజర్లను జిల్లా రవాణా కార్యాలయానికి పిలిపించి, గ్రామస్తుల సమక్షంలో సమస్యకు పరిష్కారం చూపిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి దేవనూరి శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, డిప్యూటీ ఆర్ఎం భూపతి రెడ్డి, సర్పంచ్ సురేష్ రెడ్డి, ఉప సర్పంచ్ కొమురవ్వతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.






