07-12-2025 08:47:14 PM
డబ్బు, మద్యానికి లొంగొద్దు..
ఆర్టీఐ నాయకులు వెంకటేశ్వర్లు గౌడ్, కుమార్ యాదవ్..
కాటారం(మల్హర్) (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ఎవరు, ఎవరికైనా ఓటు వేసే హక్కు ఉందని, గ్రామాల్లో నివసించే వారు అలాంటి ఓటును ఓ మంచి నాయకులకు వేస్తే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని, ఓటును డబ్బుకు అమ్ముకోకుండా నిజాయితీగా వేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని యైనైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ లు పిలుపునిచ్చారు.
ఆదివారం మండల కేంద్రంలో మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం దారి తప్పిందని, ఎన్నికల్లో గెలవాలన్నా ఉద్దేశంతో మంచిని మరిచి ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఇప్పటి నుంచే పడరాని పాట్లు పడుతున్నారని తెలిపారు.
ఇలాంటి అంశాలపై అధికారులు ఓటర్లను చైతన్య పర్చి నోటుకు ఓటును అమ్ముకుంటే జరిగే పరిణామాలపై ఓటర్లకు వివరిస్తే మంచి నాయకునికి ఓటు వేసే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా అధికారులు యువతకు అవగాహన సదస్సులు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకొస్తే భావితరాలకు మార్గం చూపిన వారుగా నిలిచిపోతారన్నారు. ఓటుహక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వేయాలని, ఓటు మనతో పాటు మన గ్రామాన్ని అభివృద్ధి చేసే ఒక వజ్రాయుధం లాంటిదన్నారు.