12-02-2026 12:00:00 AM
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ సుధీర్ బాబు
రంగారెడ్డి, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని ఆరు పురపాలక సంఘాల్లో పోలింగ్ పర్వం ముగిసింది. అడపాదడపా చిన్నపాటి ఘర్షణలు మినహా, ఓటింగ్ ప్రక్రియ అంతా అత్యంత ప్రశాంత వాతావరణంలో జరగడం విశేషం.
ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా తరలిరావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో (చేవెళ్ల, షాద్ నగర్, శంకర్ పల్లి, మొయినాబాద్, ఆమనగల్, ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగాయి. ఉదయం 6 గంటల నుంచి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను పోలింగ్ సిబ్బంది ప్రారంభించారు.
ఆరు మున్సిపాలిటీలు 06
మొత్తం వార్డులు 126
పోలింగ్ కేంద్రాలు 274
మొత్తం ఓటర్లు 1,76,023
పోలైన ఓట్లు 1,38,222
పోలింగ్ శాతం 78.52%
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ..
పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
మందకోడిగా మొదలై.. హోరెత్తిన ఓటింగ్
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన సమయంలో ఓటర్ల రాక కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ఎండ పెరిగే కొద్దీ క్యూ లైన్లు పెరిగాయి. మధ్యాహ్నం తర్వాత ఓటర్లు భారీగా తరలిరావడంతో పోలింగ్ శాతం అంచనాలకు మించి 78.52 శాతానికి చేరుకుంది. వృద్ధులు, యువత మరియు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించి, ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలను మూసివేసి సీల్ చేశారు. అనంతరం ఆయా పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూములకు తరలించారు.