ఇగ్నో హైదరాబాద్ రీజినల్ సెంటర్ నూతన డైరెక్టర్గా వరంగల్ ముద్దుబిడ్డ
బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రాజు బోల్లా
హనుమకొండ, నవంబర్ 4 (విజయ క్రాంతి): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం మొట్ట మొదటి రీజనల్ సెంటర్ అయిన ఇగ్నో హైదరాబాద్ రీజినల్ సెంటర్ నూతన రీజనల్ డైరెక్టర్ గా డాక్టర్ రాజు బోల్లా నియమితులయ్యారు. డాక్టర్ రాజు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా, నెక్కొండ మండలం, సూరిపల్లి గ్రామం నుండి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి నేడు ఇగ్నో హైద్రాబాద్ రీజనల్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం పలువురికి ఆదర్శప్రాయం.
డాక్టర్ రాజు వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి బాటనీలో పీజీ, పి.హెచ్.డీ. పూర్తి చేసి, మొదటగా జనగాంలోని ఏబీవీ కళాశాలలో లెక్చరర్ గా పని చేశారు. ఆ తర్వాత 2011లో కేరళ ఇగ్నో త్రివేండ్రం రీజనల్ సెంటర్ అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ గా పనిచేసి, ఆ తర్వాత ఇగ్నో హైదరాబాద్ రీజినల్ సెంటర్ కు బదిలీ అయ్యాక 2023 నుండి డిప్యూటీ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు.
ఇగ్నో హైదరాబాద్ రీజినల్ సెంటర్ పరిధిలో అడ్మిషన్ల ప్రక్రియ, కొత్త అధ్యయన కేంద్రాల కేటాయింపు, పలు ఇగ్నో అడ్మిషన్ల మరియు ప్రమోషన్ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తూ యూనివర్సిటీ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం హైద్రాబాద్ రీజనల్ సెంటర్ కు డైరెక్టర్ గా నియామకం అవడం సంతోషంగా ఉందని దేశంలో ఇగ్నో మొదటి రీజినల్ సెంటర్ అయిన హైదరాబాద్ రీజినల్ సెంటర్ ను మరింత ప్రగతి పథంలో ముందుకు నడిపే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
డాక్టర్ రాజు బోల్లా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా హైదరాబాద్ రీజినల్ సెంటర్ సిబ్బంది మరియు పలు అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లుమరియు అకాడమిక్ కౌన్సిలర్లు అభినందనలు తెలిపారు.




