calender_icon.png 24 June, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియాల్లో కానరాని వార్డు అధికారులు

24-06-2025 12:58:06 AM

క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరువు కార్యాలయాలకే పరిమితం

సంగారెడ్డి, జూన్ 23(విజయక్రాంతి): మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరుస్తూ అభివృద్ధి పనులను సులభతరం చేసేందుకు, ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా ప్రతి వార్డుకు ఒక అధికారిని కేటాయించారు.

యితే వార్డు అధికారులు సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలో కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీల్ మీదకు రాకుండా కార్యాలయాలకు పరిమితమవుతున్నారని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు.

పనులన్నీ అస్తవ్యస్తం...

వార్డు అధికారులు నిరంతరం పారిశుద్ధ్య కార్మికులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. పారిశుద్ధ్య ప్రణాళిక అమలు చేయడం, ఇంటింటికి చెత్త సేకరణ నిర్వహణ పక్కాగా ఉండేలా చూడాలి. అంటువ్యాధుల నివారణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం సూచించిన సింగిల్ యూజుడ్ ప్లాస్టిక్ నివారణ కట్టుదిట్టంగా అమలయ్యేలా చూడాల్సి ఉంటుంది.

అదేవిధంగా నర్సరీల మొక్కల పెంపకం, వీధి దీపాలు, నీటి సరఫరా, ఆసరా పింఛన్లు ఇతర అభివృద్ధి పథకాల అమలు, ఆస్తి పన్ను వసూలు, అసెస్మెంట్ కానివి పురోగతిలో ఉన్న వాటి వివరాలు ఎప్పటికప్పుడు రూపొందించాల్సి ఉంటుంది. అయితే వార్డు పరిధిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. ప్రధానంగా పారిశుద్ధ్య సమస్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.

కొన్ని కాలనీల్లో కుక్కలు, కోతుల బెడదతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంపై మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలకు అడ్డుకట్ట పడాలన్నా, మున్సిపాలిటీకి ఆదాయం సక్రమంగా సమకూరాలన్నా వార్డు అధికారుల పనితీరే అత్యంత కీలకం.

ఇటు అధికారులకు అటు వార్డు ప్రజలకు అనుసంధానంగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ వార్డులను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత తీసుకోవడంలో వార్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మున్సిపాలిటీ ప్రజలు ఆరోపిస్తు న్నారు. కేవలం కార్యాలయాలకు పరిమితమవుతూ తమకు కేటాయించిన విధులపై అంతగా దృష్టి సారించకపోవడంతో పట్టణవాసులు అసహనానికి గురవుతున్నారు.

పర్యవేక్షిస్తున్నాం...

సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులకు వార్డు అధికారులను నియమించాం. ప్రతిరోజు ఉదయమే వార్డు అధికారులు వార్డులలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ కూడా పారిశుధ్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల్లో కూడా అవగాహన కలగాలి. తడిపొడి చెత్త బండిలోనే చెత్తను వేయాలి. రోడ్లపై పారవేయవద్దు. ఇందుకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. 

 ప్రసాద్ చౌహాన్, కమిషనర్, సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీల వార్డులు 

మున్సిపాలిటీ      వార్డులు

సంగారెడ్డి                         38

సదాశివపేట                23

జహీరాబాద్                24

ఆందోల్ జోగిపేట         20

నారాయణఖేడ్         15

అమీన్పూర్                 24

తెల్లాపూర్                         17

బొల్లారం                         22

మొత్తం                       153