పాఠశాలకు వాటర్ ప్లాంట్ విరాళం
నవాబ్పేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 1991 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఎం.డి. హర్షిత్,చౌదరి సిద్ధేశ్వర్ కలిసి సుమారు రూ 1 లక్ష వ్యయంతో నూతన వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు.ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ అధికార ప్రతినిధి దుష్యంత్ రెడ్డి, ఎంఈఓ నాగ్య నాయక్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించి, విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించి సహాయం చేసిన పూర్వ విద్యార్థుల సేవాభావాన్ని ప్రత్యేకంగా అభినందించారు.పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు డైనింగ్ హాల్ అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తించారు. దీనిపై స్పందించిన మాజీ అధికార ప్రతినిధి దుష్యంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలకు డైనింగ్ హాల్ మంజూరు అయ్యేలా తన వంతు కృషి చేస్తానని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






