03-05-2025 02:55:16 AM
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): న్యాయవాదుల సంక్షేమానికి తమ ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. శుక్రవారం లక్డీకాపూల్లోని ఓ హోటల్ లో జరిగిన అడ్వొకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ రజతోత్సవాల ముగిం పు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయవాదుల భద్రత కోసం ఇటీవలే ‘ప్రొటెక్షన్ యాక్టు’ను చట్టం చేసామని శ్రీధర్బాబు వెల్లడించారు. త్వరలోనే దానిని అమలులోకి తెస్తామని చెప్పారు.
న్యాయవాదుల సంక్షేమం కోసం అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయించే విషయమై న్యాయశాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డిని కోరతామని ఆయన భరోసా ఇచ్చారు. వెయ్యి కోట్ల డిపాజిట్లతో న్యాయవాదుల సొసైటీ ఆర్థికంగా బలంగా ఉన్నదన్నారు. అనారోగ్యంపాలైన వారికి, చనిపోయిన లాయర్ల కుటుంబాలకు సొసైటీ అండగా నిలుస్తుండటాన్ని శ్రీధర్బాబు ప్రశంసించారు.
ఢిల్లీ యూనివర్సిటీలో లా పూర్తి చేసిన తర్వాత అక్కడి తీస్ హజారీ కోర్టుల్లో కొన్నాళ్లు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో మూడేళ్లు ప్రాక్టీసు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సహచర ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్ (అంబర్పేట), జి.మధుసూదన్రెడ్డి (దేవరకద్ర)లతో కలిసి న్యాయవాదుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 28 కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కరిస్తామని తెలిపారు. అంతకు ముందు ఆయన ఎమ్మెల్యేలతో కలిసి సొసైటీ సిల్వర్ జూబ్లీ సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపక సభ్యులు సునీల్ గాను, అధ్యక్షుడు శ్రీనాథ్, కార్యదర్శి శ్రీధర్ తదితరులు ప్రసంగించారు.