03-05-2025 02:52:18 AM
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): దశాబ్దాల చరిత్ర ఉన్న సింగరేణి అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బొగ్గుగనినే కాక ఉద్యోగాలు చూపే గనిగా సింగరేణి రూపుదిద్దుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణి కారుణ్య నియమకాల వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచడం వల్ల లబ్ధిపొందిన 21మంది వారసులకు హైదరాబాద్ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్లో శుక్రవారం నియామక పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కార్మికులు, కార్మిక సంఘాల కోరిక మేరకు వయోపరిమితిని పెంచామని, దీంతో వందల మందికి ఉద్యోగాలు లభించే అదృష్టం దక్కిందని చెప్పారు. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం చేపట్టామని, జూన్ 2న పత్రాలు అందజేస్తామన్నారు. సింగరేణి సీఎండీ బలరామ్, గుర్తింపు కార్మి క సంఘం ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్, డైరెక్టర్(పీఅండ్పీ, పర్సనల్) వెంకటేశ్వర్లు, అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్ పాల్గొన్నారు.