31-05-2025 11:27:21 PM
ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ
ఖైరతాబాద్ (విజయక్రాంతి): ఆయిల్ ఫెడ్ ను నిర్వీర్యం చేసి నష్టాల పాలు చేసే కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్(Telangana Oil Fed Aswaraopeta Zone) ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షులు తుంబురు ఉమ మహేశ్వర రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలువురు రైతులతో కలిసి ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్ మొక్కలను కూడా విత్తన చట్టం కింద తేవాలని కోరారు. టిజి ఆయిల్ ఫెడ్ అన్ని కంపెనీ కార్యకలాపాలపై ప్రభుత్వం విచారణ ప్రారంభించాలని అన్నారు.
అన్ని అక్రమ ఆర్థిక లావాదేవీలపై కేంద్రప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2016 నుంచి 2023 కాలంలో సరఫరా చేసిన విత్తనాల వల్ల నష్టపోయిన ఆయిల్ ఫామ్ రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయిల్ పామ్ విస్తరణకు ఆయిల్ ఫెడ్ కొత్త విత్తనాలతో నర్సరీ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 2016-2022 ఆయిల్ ఫెడ్ నర్సరీలలో కాంట్రాక్ట్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని కర్లింగ్ మొక్కలను రైతుల తోటలోకి రావటానికి కారణమైన కాంట్రాక్టర్, అధికారులపై విచారణ చేపట్టి, ఆయిల్ ఫెడ్ నుంచి తొలగించి, వాటిల్లిన నష్టాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్ధి, ఆయిల్ పామ్ రైతుల శ్రేయస్సు కోసం తమ సంస్థ కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ వ్యవస్థను టిజి ఆయిల్ ఫెడ్ నర్సరీల నుంచి తొలగించాలని కోరారు. ఆయిల్ పామ్ రిఫైనరీని భద్రాద్రి కొత్తగూడం జిల్లాలోనే నిర్మించాలని కోరారు. ఆయిల్ పామ్ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. సమావేశంలో ఆయిల్మ్ అశ్వారావుపేట రైతులు కారం రాములు, సోమిరెడ్డి, మేడ జగ్గారావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.