765 కేవీ విద్యుత్ లైన్ బాధితులను ఆదుకోవాలి
కందుకూరు ఆర్డీఓకు రైతుల వినతి
కడ్తల్,ఫిబ్రవరి 23(విజయక్రాంతి): కడ్తాల్ మండల పరిధిలోని గ్రామాల మీదుగా ఏర్పాటు చేస్తున్న 765KV బీదర్ - మహేశ్వరం హైటెన్షన్ విద్యుత్ లైన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి తక్షణమే న్యాయం చేయాలని సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి. లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కడ్తాల్ మండల రైతులతో కలిసి ఆయన కందుకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి జగదీశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారీ విద్యుత్ స్తంభాలు, తీగల వల్ల భూమి వినియోగం తగ్గిపోవడమే కాకుండా, పంట దిగుబడిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేగంగా విస్తరిస్తున్న కడ్తాల్ గ్రామ సమీపంలో ఈ లైన్లు వేయడం వల్ల భవిష్యత్తులో రియల్ ఎస్టేట్, ఇతర అభివృద్ధి పనులు కుంటుపడతాయని ఆయన పేర్కొన్నారు. హైటెన్షన్ వైర్ల కింద ఉన్న భూములకు క్రయవిక్రయాలు జరగక, బ్యాంక్ రుణాలు అందక రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల గోడును విన్న RౄO జగదీశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, రైతులకు న్యాయం జరిగేలా నివేదిక అందజేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని, అవసరమైతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో కడ్తాల్ మాజీ ఉప సర్పంచ్ కడారి రామకృష్ణ, వార్డు సభ్యులు ఎర్రోళ్ల రాఘవేందర్, బీసీ సంఘం అధ్యక్షుడు పిప్పల్ల వెంకటేష్, మరియు గూడూరు శేఖర్ రెడ్డి, పెంటారెడ్డి, కేశవులు, శ్రీరాములు తదితర రైతులు పాల్గొన్నారు.




