17-05-2025 12:00:00 AM
కలెక్టర్ ఇలా త్రిపాటి
నల్లగొండ టౌన్, మే 16 : నల్గొండ జిల్లాలో గత రబీతో పోలిస్తే ఈ రబీలో 160 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో రబీ ధాన్యం సేకరణ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా జిల్లాలో ధాన్యం సేకరణ వివరాలను జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ జిల్లాలో ఈ రబీలో 5 లక్షల 57 వేల మెట్రిక్ టన్ను ధాన్యం వస్తుందని అంచనా వేయడం జరిగిందని, ఇప్పటివరకు 70 నుండి 80% ధాన్యాన్నీ కొనుగోలు చేశామని, సుమారు 5 లక్షల 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలియజేశారు.
మరో 22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉందని చెప్పారు. జిల్లాలో 8 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తికానున్నట్లు తెలిపారు.అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఒకే మిల్లుకు పంపించకుండా జిల్లాలోని అన్ని మిల్లులకు సమానంగా పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల మిల్లర్లకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, మార్కెటింగ్ శాఖ ఏ డి ఛాయదేవి ,జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.