08-08-2025 05:55:12 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan) అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డుల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కొత్త రేషన్ కార్డు మంజూరు పత్రాలు, కుటుంబ సభ్యుల చేర్పు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. మండలంలోని 92 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రామారెడ్డి మండలంలో 704 నూతన రేషన్ కార్డులు, 1457 పాత రేషన్ కార్డులో సభ్యుల చేర్పులు మంజూరయ్యాయని తెలిపారు.
అనంతరం పల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో పాల్వంచ మండలంలోని 91 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు మంజూరు పత్రాలను అందజేశారు. పాత రేషన్ కార్డులలో 54 మంది నూతన సభ్యుల చేర్పు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పల్వంచ మండలంలో 202 నూతన రేషన్ కార్డులు మరియు పాత రేషన్ కార్డులలో 229 మందిని నూతన సభ్యులుగా చేర్చడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పొందడం మాత్రమే కాకుండా నిరుపేద ప్రజలకు ప్రభుత్వం కల్పించే వివిధ పథకాలను, సౌకర్యాలను పొందవచ్చని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, రామారెడ్డి తాసిల్దార్ ఉమలత, ఏఎస్ఓ స్వామి, పల్వంచ తాసిల్దార్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.