08-08-2025 05:48:01 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట మండలం(Kasipet Mandal) దేవాపూర్ గ్రామానికి చెందిన గంగాధరి వాణి(44) అనే వివాహిత కరీంనగర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు దేవాపూర్ ఎస్సై ఏ.గంగారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం, మృతురాలు వాణికి దేవాపూర్ గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తితో 20 ఏళ్ల కిందట వివాహమైందన్నారు. ఆమెకి 11 ఏళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిపారు. భర్త శంకర్ మద్యానికి అలవాటు పడి ఎటువంటి పని చేయకపోవడంతో ఆమె కుట్టుమిషన్ తొక్కుకుంటూ ఇంటి భారాన్ని మోస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితి భరించలేక గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. ముందుగా భర్త ఆమెను దేవాపూర్ కంపెనీ ఆసుపత్రికి తీసుకెళ్లారని పరిస్థితి విషమించడంతో ఆంబులెన్స్ లో భర్త శంకర్, ఆమె తమ్ముడు రవీందర్ లు కరీంనగర్ లోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా గురువారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గంగారం తెలిపారు.