04-06-2025 01:13:32 AM
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): మూడేండ్లలో తెలంగాణలో తిరిగి అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత ఐటీ పరిశ్రమను మరింత విస్తృతంగా అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొఒన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భవి ష్యత్తులో లాభమే జరుగుతోందని, ప్రభుత్వాలు, ఐటీ కంపెనీలు కలిసి పని చేస్తేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మన దేశ యువత పోటీపడగలుగుతుందన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్, అక్కడి ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులతో డల్లాస్లో సమావేశమయ్యారు. అమెరికాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల మీద స్పందించిన కేటీఆర్, చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు ఇండియాలో ఆఫ్ షోర్ సెంటర్ లను ఏర్పాటుచేసే అవకాశముందన్నారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ, అనుబంధ పాలసీలతోనే తొమ్మిదేండ్లలో ఐటీకి హైదరాబాద్ ల్యాండ్ మార్క్గా మారిందన్నారు.
ఐటీ రంగ అభివృద్ధి కోసం ఇన్నోవేషన్, ఇంకుబేషన్లో తీసుకొచ్చిన విప్లవాత్మక విధానాలతోనే చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా హైదరా బాద్ ఐటీ పరిశ్రమ ఎదిగిందన్నారు. 2014 లో హైదరాబాద్లో కేవలం 3,23,000 ఐటీ ఉద్యోగాలు మాత్రమే ఉంటే, తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి ఆ సంఖ్య పది లక్షలకు చేరిందని కేటీఆర్ తెలిపారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో టెక్ కంపెనీలు అమెరికా ఆవల తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్లో నెలకొల్పాయన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల కారణంగా చాలా టెక్ కంపెనీలు ఇండియాలో తమ ఆఫ్షోర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాయని కేటీఆర్ చెప్పారు. ఇండియాలోని టైర్ టూ నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే అవకాశా లున్నాయని చెప్పారు.
బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో టైర్ టూ నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించామని కేటీఆర్ తెలిపారు. ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, సిద్దిపేట్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి 10 నగరాల్లో ప్రభుత్వం ఐటీ హబ్లను ఏర్పాటుచేసి, మొదటి ఏడాది రెంట్ ఫ్రీ, ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్తో పాటు ఎన్నో రాయితీలు కల్పించామని కేటీఆర్ చెప్పారు. అలా ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన ఎన్టీటీ డేటా కంపెనీ 500 మంది ఐటీ నిపుణులతో అద్భుతంగా పురోగతి సాధిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.
అమెజాన్, గూగుల్ లాంటి మల్టీ నేషనల్ కంపెనీలు టైర్ టూ నగరాలకు వెళ్లలేవన్న కేటీఆర్, చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు మాత్రమే అక్కడికి చేరగలవన్నారు. ఇండియాలోని టైర్ టూ నగరాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, మంచి రైల్, రోడ్ కనెక్టివిటీతో రాబోయే రెండు దశాబ్దాల్లో అద్భుతాలు జరుగుతాయన్నారు.
భారత విద్యార్థులకు అండగా ఉంటాం
అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండగా నిలబడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులు, అవగాహన లేక ఏమైనా తప్పుచేస్తే వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు బీఆర్ఎస్ అమెరికా విభాగం తరఫున ప్రయత్నం చేస్తామన్నారు.
డల్లాస్ వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశానికి ముందు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్లో చదువుకుంటున్న విద్యార్థులతో మాట్లాడారు. యూనివర్సిటీ విద్యా ర్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ప్రపంచంతో ఇండియా పోటీపడి రాణించాలంటే విదేశాల్లో చదువుకుంటున్న యువత సహకరించాలన్నారు.
అమెరికా వచ్చిన విద్యార్థులు ఏదైనా కారణంతో తిరిగివస్తే ఆ విద్యార్థి, వారి కుటుంబం ఎంతో ఆవేదనకు గురవుతుందన్నారు. దీనికోసమే విద్యార్థులకు అండగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులు కూడా అమెరికా చట్టాలను, అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకొని మసులుకోవాలని కేటీఆర్ సూచించారు