05-12-2025 02:04:09 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): జిల్లాలోని వలస కార్మికుల పిల్లల చదువును ప్రోత్సహిస్తామని, ఇందుకోసం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో వారికి ప్రత్యేక తరగతి గదులను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గంగాధర మండలం గట్టుభూత్కూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వలస కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరగతి గదిని కలెక్టర్ గురువారం ప్రారంభించారు.
ఇక్కడ 42 మంది వలస కార్మికుల పిల్లలని గుర్తించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. తరగతి గదిలోని చిన్నారులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వివిధ భాషల్లో పలుకరించి చదువు, స్వస్థలం, కుటుంబ సభ్యుల వివరాల వంటివి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వలస కార్మికుల పిల్లలందరినీ గుర్తించి వారికి సమీప పాఠశాలల్లో ప్రత్యేక తరగతి గదిలో విద్యా బోధన చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది సుమారు 500 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్చి చదువు చెప్పించామని అన్నారు.
- పూర్వ ప్రాథమిక పాఠశాల సందర్శన
విద్యాశాఖ ఆధ్వర్యంలో గట్టుబూత్కూరు మండల ప్రాథమిక పాఠశాలలోని పూర్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న పిల్లలతో మమేకమయ్యారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ రజిత, మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు, తదితరులుఉన్నారు.