calender_icon.png 4 June, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందూ ధర్మం గొంతు నొక్కితే సహించం

03-06-2025 12:42:23 AM

మెదక్ ఎంపీ రఘునందన్ రావు 

సిద్దిపేట, జూన్ 2 (విజయక్రాంతి):  హిందూ ధర్మం గొంతు నొక్కితే సహించేది లేదని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు రాజారాం, మురళిలపై పలువురు ముస్లింలు దాడి చేయడాన్నీ తీవ్రంగా ఖండించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, దాడికి గల కారణాలను తెలుసుకున్నారు.

వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి బక్రీద్ పండుగకు గో మాతలను (గోవు) వధించడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన హిందువులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం, రిమాండ్ చేయడం ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. ముస్లింలు గోవులను వధించకుండా వాళ్ల సాంప్రదాయ పండుగలను చేసుకోవాలని కోరారు.

సిద్దిపేటలో గతంలో జరిగిన సంఘటనల ప్రాంతాలలో పోలీస్ టికెట్ ఏర్పాటు చేసి గోవులను సంరక్షించాలని, లేదంటే తామే వాలంటీర్లుగా పనిచేస్తామంటూ చెప్పారు. బక్రీద్ పండుగకి వధించేందుకు గోవులను తీసుకొచ్చిన విషయాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విశ్వహిందూ పరిషత్ నాయకులపై దాడి చేయడంతో పాటు అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు.

గతంలో మెదక్ లో జరిగిన సంఘటనను వివరిస్తూ ఈసారి సిద్దిపేట వేదిక అయింది అంటూ చెప్పారు. భారతదేశంలో అత్యధికంగా పూజించే గోవులను వధించడం చట్ట వ్యతిరేక చర్యగా వివరించారు. రాజారామ్, మురళిలకు పోలీస్ భద్రత కల్పించాలని, వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, నాయకులు సంతోష్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.