పసి మెదడులపై జిహాదీ దాడులు సహించం
వీహెచ్పీ ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ బాలస్వామి
హైదరాబాద్, జులై 17(విజయక్రాంతి): హిందూ చిన్నారులకు ఇస్లాం మతపరమైన హోంవర్క్ ఇవ్వడం తీవ్ర నేరమని విశ్వహిందూ పరిషత్ ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్మ చదవడం.. ఖురాన్ పఠించడం కోసం ప్రత్యేకంగా హోంవర్క్ ఇచ్చే విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్న జిహాదీ మత చాందసవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాల్యంలోనే పసి మెదడుకు విషం నింపే విష సంస్కృతి నేడు విద్యాలయాలలో విజృంభించడం తీవ్ర ఆవేదన కలిగిస్తుందన్నారు. హిందువుల పిల్లలకు ఉర్దూ నేర్పించడం, హిజాబ్ ధరించడం, ఇస్లాం బోధించడం, రకరకాలుగా కొత్త కొత్త పద్ధతుల ద్వారా చిల్డ్రన్ జిహాద్ కు పాల్పడుతున్న ఇస్లామిక్ టెర్రరిస్టు భావాల మనుషులకు చట్టపరమైన విధంగా శిక్షించాలని పేర్కొన్నారు.
అభం శుభం తెలియని పసిపిల్లలను బాల్యంలోనే టార్గెట్ చేసి మతమార్పిడి ప్రక్రియను ప్రారంభించడం తీవ్ర ఆందోళనకరమన్నారు. ఇది భారత రాజ్యాంగానికే ప్రమాదం అని వివరించారు.‘కాంగ్రెస్ అంటే ముస్లిం .. ముస్లిం అంటే కాంగ్రెస్’ అని గర్వంగా చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు.
ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావునే ముస్లిం ప్రభుత్వం అనే ధైర్యంతోనే ఇస్లామిక్ భావజాలం కలిగిన వ్యక్తులు బలవంతపు మతమార్పిడులకు, చిల్డ్రన్ జిహాదులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. వెంబడే ఈ ఘటనలకు బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని బాలస్వామి డిమాండ్ చేశారు. విద్యాలయాలు అంటే మతమార్పిడి కేంద్రాలు కాదు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని ఎద్దేవా చేశారు.






