10-02-2026 12:00:00 AM
హస్తినాపురంలోని వెల్ నెస్ దవాఖానలో బిల్లు చెల్లించే వరకు మృతదేహాన్ని ఇవ్వని వైనం
ఎల్బీనగర్, ఫిబ్రవరి 9 : హస్తినాపురంలోని వెల్నెస్ హాస్పిటల్లో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపిం ది. చికిత్స పొందుతూ రోగి మృతి చెందగా, ఫీజు చెల్లించే వరకు మృతదేహాన్ని ఇవ్వమని కుటుంబ సభ్యులను దవాఖాన యాజమాన్యం వేధించింది. హస్తినాపురంలోని వెల్ నెస్ హాస్పిటల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నజిక్ సిం గారం గ్రామానికి చెందిన దార జయమ్మ (45) ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుండగా, కుటుంబ సభ్యులు ఈ నెల 4న హస్తినాపురంలోని వెల్ నెస్ హాస్పిటల్లో చేర్పించారు. నాలుగు రోజుల పాటు చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించి 8న ఆదివారం రాత్రి జయమ్మ మృతి చెందింది.
అయితే రోగి మృతి చెందిన అనంతరం ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఫీజు చెల్లించే వరకు మృతదేహాన్ని ఇవ్వమని దవాఖాన సిబ్బంది మొండికేశారు. కనీస మానవత్వం చూపలేదని మృతురాలి కు టుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జయమ్మకు చికిత్స ఇచ్చినప్పుడు నుంచే దవాఖా న యాజమాన్యం రెండు విడతలుగా మొత్తం రూ.50,000 వసూలు చేశారు.
అయితే జయమ్మ మృతి చెందిన తర్వాత అదనంగా రూ.1,50,000 ఇవ్వాలని వేధించారు. తాము కూలీ పనులు చేసుకుని బతు కుతున్నామని, అంత ఇవ్వలేమని కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డాడు. అంత చెల్లించలేమని మరో రూ.20 వేలు మొత్తం రూ.70 వేల ఇస్తామని మృతదేహం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మొత్తం డబ్బులు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వకుంటే మృతదేహాన్ని ఇవ్వమని దవాఖాన సిబ్బంది చెప్పారు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు స్థానిక నాయకులను ఆశ్రయించారు.
దీంతో బీజేపీ నాయకులు వెంటనే బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ లచ్చిరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన దవాఖాన యాజమాన్యంతో మాట్లాడి బిల్లు తగ్గించాలని కోరారు. అనంతరం బీజేపీ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు ఎరుకల మల్లేశ్ గౌడ్ స్థానికులతో కలిసి దవాఖానకు చేరుకుని మేనేజర్ అజయ్తో చర్చించారు. రూ. లక్ష చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని చెప్పారు.
చివరకు కుటుంబ సభ్యులు మొత్తం రూ.95,000 ఇస్తామని చెప్పారు. దీంతో మృతదేహాన్ని సోమవారం ఉదయం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేవలం నాలుగు రోజుల చికిత్సకు రూ, 1.50 లక్షల బిల్లు వేశారని, స్థానిక నాయకుల జోక్యంతో దవాఖాన యాజమాన్యం దిగివచ్చిందని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీని ఎవరూ అడ్డుకుంటారని మృతురాలి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.