calender_icon.png 22 June, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం అందిస్తాం

21-06-2025 11:37:55 PM

సుందిళ్లలో సింగరేణి మైనింగ్ లీజు భూముల పరిహారం పై నిర్వహించిన గ్రామ సభ లో  జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

రామగిరి (విజయక్రాంతి): సింగరేణి గ్రామంలో సింగరేణి మైనింగ్ లీజు భూములు కోల్పోతున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఎక్స్ గ్రేషియా చెల్లింపు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) అన్నారు. శనివారం రామగిరి మండలం సుందిళ్ల గ్రామ పంచాయతీ భవనం వద్ద నిర్వహించిన సింగరేణి మైనింగ్ లీజు భూముల ఎక్స్ గ్రేషియా చెల్లింపుపై నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ... రామగిరి మండలం సుందిళ్ళ గ్రామంలో సింగరేణి ఆర్జి 1 మైనింగ్ లీజు క్రింద 269 ఎకరాలలో సర్వే చేయడం జరిగిందని, ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ భూములు సింగరేణి లీజు భూముల ఉన్నాయని, ఒక్కో సర్వే నెంబర్ లో ఉన్న భూమిపై 4, 5 రైతులు యాజమాన్య హక్కు క్లెయిమ్ చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. 

ప్రజలకు ఎటువంటి పట్టాలు అధికారికంగా లేనప్పటికీ కబ్జాలో ఉన్న ప్రజలు నష్టపోతారని ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఎకరానికి 6 లక్షల 50 వేల రూపాయల పరిహారం అందించేందుకు సింగరేణి సంస్థను ఒప్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పరిహారం అర్హులైన వారికి మాత్రమే చేరే విధంగా జాబితా రూపొందించేందుకు గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నామన్నారు. గ్రామ సభలో ప్రజల సమక్షంలో అర్హులైన వారికి మాత్రమే సింగరేణి మైనింగ్ లీజ్ పరిహారం చెల్లించడం జరుగుతుందని, జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు. 

భూ వివాదాల సమస్యలు ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎవరి కబ్జాలో భూమి ఉందో పరిశీలించి ప్రజల నుంచి వివరాలు సేకరించి ఎక్స్ గ్రేషియా చెల్లింపు జరుగుతుందని, రెవెన్యూ, సింగరేణి అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వచ్చిన సమాచారం ప్రకారం భూ హక్కులను గ్రామ సభలో చదివి వినిపించామని, దీని పై ఉన్న అభ్యంతరాలను తెలియజేయాలని, ప్రతి సర్వే నెంబర్ పరిధిలో ఎంత భూమి ఉంది, ఎవరి ఆధీనంలో ఉందో పరిశీలించి పరిహారం అందిస్తామని, వివాదరహిత భూములకు వారం రోజులలో పరిహారం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, జి. యం.ఆర్. జి.1 లలిత్ కుమార్, తహసిల్దార్ సుమన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.