20-02-2026 12:00:00 AM
ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో సెక్రెటరీ హామీ
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్టంలోని సాంఘీక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల పాఠశాలల పనివేళలు ఉపాధ్యాయులు కోరుతున్న విధంగా సవరిస్తామని గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణ అదిత్య హామీ ఇచ్చారు. గురువారం సాంఘీక సంక్షేమ గురుకులాల సొసైటీలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించటానికి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో టీయస్ యూ టీఎఫ్ పక్షాన రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్, సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటి విభాగం నాయకులు ఎల్లయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ...విద్యార్థుల సంక్షేమానికి ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పా రు.
ఉపాధ్యాయుల సమస్యలపై టీఎస్ యూటీఎఫ్ ఇచ్చిన ప్రాతినిధ్యంపై స్పంది స్తూ ప్రమోషన్ ప్రక్రియను త్వరలో చేపడతామని, పాఠశాలల సమయం మార్పు చేయడంతోపాటు రాత్రి విధులు నిర్వహించిన వారికి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు అనుమతించడానికి అంగీకరించారని తెలిపారు. పార్ట్ టైం టీచర్ల వేతనాలు రెండు రోజుల్లో విడుదల చేస్తామని, రెగ్యులర్ ఉపాధ్యాయులకు 010 వేతనాల అమలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.