30-10-2025 07:56:17 PM
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
ముకరంపురా (విజయక్రాంతి): గత పాలకవర్గాల హాయంలో అర్బన్ బ్యాంకు అద్వాన స్థితికి చేరుకుందనీ, అస్తవ్యస్తంగా మార్చారనీ, బ్యాంకును సమూలంగా ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు స్పష్టం చేశారు. నీతి నిజాయితీతో మీ ముందుకు వచ్చిన మా ప్యానల్ అభ్యర్థులకు అర్బన్ బ్యాంకు మెంబర్లు మార్పు కోసం ఆశీర్వదించాలని మంచి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం కరీంనగర్లోని మైత్రి హోటల్లో వెలిచాల రాజేందర్రావు అర్బన్ బ్యాంక్ ప్యానల్ అభ్యర్థులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో తమ ప్యానెల్ ను గెలిపిస్తే అర్బన్ బ్యాంకును ఏ విధంగా తయారు చేస్తామనే అంశంపై ఒక మేనిఫెస్టో మేనిఫెస్టోను ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలం నుంచి అర్బన్ బ్యాంకు అద్వానస్థితికి చేరుకుందని, దీనికి గత పాలకవర్గాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. బ్యాంకు పాలకవర్గాలు బ్యాంకు అభివృద్ధి కోసం దోహదపడాలి కానీ వారి సొంత లాభం కోసం చూసుకున్నారు బ్యాంకును ఏ మాత్రం పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
8 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకుండా కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని మళ్ళీ వారే వచ్చి మాకు అధికారం కావాలని ఓట్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. అనేక అవినీతి ఆరోపణలు ప్రత్యారోపణలు ఇల్లీగల్ మెంబర్షిప్ ఇతర వివాదాస్పద అంశాలు మీడియాలో పత్రికల్లో పెద్ద ఎత్తున వచ్చాయని తెలిపారు. అర్బన్ బ్యాంకు అభివృద్ధి ఏమోగానీ ప్రతిష్టను దెబ్బ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. గోల్డ్ పేట రోల్డ్ గోల్డ్ పెట్టి రుణాలు కూడా తీసుకున్నారని ఆరోపణలు అప్పట్లో వచ్చాయని పేర్కొన్నారు. ఇతర బ్యాంకులు డిపాజిట్లను పెట్టుబడుల కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటే అర్బన్ బ్యాంక్ పాలకవర్గాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు కోసం కాంగ్రెస్ భావాజాలం కాంగ్రెస్ వ్యక్తిత్వం సామాజిక సేవ నేపథ్యం నీతిమంతంగా నిజాయితీ వంతంగా జ్ఞానం పరిజ్ఞానం వారితో కలిసి ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేశానని తెలిపారు.
అర్బన్ బ్యాంకు ను పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు తమ ప్యానెల్ కు ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని ఒక అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. మంచి సేవా భావం ఎలాంటి లాభ పక్ష లేకుండా పనిచేసేందుకు ముందుకొచ్చిన నిర్మల భరోసా ప్యానల్ ను గెలిపించవలసిన అవసరం ఆవశ్యకత ఉందన్నారు. గురువారం కరీంనగర్ లో ఉన్న 20 సంఘాలు తమ ప్యానెల్ కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలుపడం అభినందనీయమన్నారు. లారీ అసోసియేషన్, ఆటోనగర్ అసోసియేషన్, హమాలీ సంఘం పద్మశాలి సంఘం, కాపు సంఘం, రెడ్డి సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, గౌడ సంఘం, ఐఎంఏ డాక్టర్ల సంఘం బార్ అసోసియేషన్ తో పాటు దాదాపు 20 సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ ప్యానెల్ కు మద్దతు ప్రకటించాయని తెలిపారు. అభ్యర్థులందరినీ మంచి మెజార్టీతో గెలిపిస్తామని వారు పేర్కొనడం అభినందనీయమని రాజేందర్రావు పేర్కొన్నారు.
కరీంనగర్ జగిత్యాల ప్రాంతాల్లో రిటైర్డ్ ఉద్యోగులు సంఘాల ప్రతినిధులు వాకర్సు అనేకమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు సంఘీభావం ప్రకటించారని తెలిపారు. అర్బన్ బ్యాంక్ అభివృద్ధిలో మా తండ్రి జగపతిరావు పాత్ర గణనీయంగా ఉందన్నారు. నాలుగు ఎన్నికల్లో ప్యానల్ ఏర్పాటు చేసి గెలిపించిన ఘనత మా తండ్రిగారిదేనని తెలిపారు. అర్బన్ బ్యాంకు అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారని ఆయన ఆశయ సాధనకు తాను అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గతంలో 18 వేల మెంబర్లతో నడిచిన అర్బన్ బ్యాంకు నేడు 9000 పరిమితమైందని బ్యాంకును మొత్తం లోపభూయిష్టంగా మార్చి వేశారని పారదర్శకతకు పాతర వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా డిపాజిట్లు పెంచడం..ఖాతాదారులను చేర్పించడం మర్చిపోయారని పేర్కొన్నారు. గతంలో పనిచేసిన కర్ర రాజశేఖర్, గడ్డం విలాస్ రెడ్డిలు ఇరువురు ఆరోపణలు చేసుకొని బ్యాంకు ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. ఈ లాంటి తరుణంలో బ్యాంకును మొత్తం ప్రక్షాళన డిజిటలైజేషన్ చేసేందుకు తమ ప్యానల్ కు అవకాశం కల్పించాలని కోరారు.
మంత్రుల ఆశీర్వాదంతో ముందుకు..
ప్యానల్ అభ్యర్థులతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు ,విప్ ఆది శ్రీనివాస్ వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నామని రాజేందర్రావు పేర్కొన్నారు. తప్పకుండా గెలిచి రావాలని కోరారు. ఈ తమకెంతో ఉత్సాహాన్ని అందించిందని అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మద్దతు ఇచ్చారని తెలిపారు. అక్కడి నుంచి ఇద్దరు మంచి వ్యక్తులను ప్రతిపాదించడం హర్షనీయ మన్నారు. జగిత్యాల లో మంచి మెజార్టీ రావడానికి ఎమ్మెల్యే తీవ్రంగా కష్టపడుతున్నారని రాజేందర్ పేర్కొన్నారు.
జాతీయ బ్యాంకులతో పాటు ఇతర బ్యాంకులకు ధీటుగా ఎయిర్ కండిషన్ తో కూడిన సత్వరమే సేవలందిస్తామ న్నారు... ఖాతాదారులకు పెట్టుబడిదారులకు రక్షణగా ఉంటాము. విశ్వాసాన్ని కల్పిస్తాము. వారి నమ్మకాన్ని వమ్ము చేయబోము. బ్యాంకును సంస్కరిస్తామని ఆన్లైన్లో లావాదేవీలు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ చేపడుతాము. ఖాతాదారులకు సత్వరమే సేవలందించేలా చూస్తాము అనీ చెప్పారు. కరీంనగర్ జగిత్యాలలో అదనంగా ఒక్కొక్క బ్రాంచ్ ను ఏర్పాటు చేస్తాం.
అదేవిధంగా హుస్నాబాద్, హుజురాబాద్ జమ్మికుంట, చొప్పదండి లో కొత్త బ్రాంచులను ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 72 కోట్లు ఉన్న డిపాజిట్లను వచ్చే మూడేళ్లలో 200 కోట్లు డిపాజిట్ చేరుకునేలా బ్యాంకు ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం.. అని పేర్కొన్నారు. అదేవిధంగా 58 కోట్ల అడ్వాన్సులను 150 కోట్లకు చేరుకునేలాగా కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను. మూడు సంవత్సరాలలో ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని గంట పదంగా చెబుతున్నాను. మాట ఇవ్వడమే కాదు అర్బన్ బ్యాంకును తెలంగాణ రాష్ట్రంలోనే స్మార్ట్ బ్యాంకు గా తయారు చేస్తామని రాజేందర్ రావు హామీ ఇచ్చారు.
స్వచ్ఛందంగా వివిధ సంఘాల మద్దతు..
నిర్మల భరోసా ప్యానల్ కు స్వచ్ఛందంగా వివిధ సంఘాలు గురువారం మద్దతు తెలిపాయని రాజేందర్రావు పేర్కొన్నారు. వారు ముందుకొచ్చి మద్దతు తెలుపడం అభినందనీయమన్నారు. వివిధ కుల సంఘాలు రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్, రెడ్డి సంఘం, వెలమ సంఘం, పద్మశాలి సంఘం, కురుమ సంఘం, గౌడ సంఘం, బార్ ఆసోసియేషన్, రెడ్క్రాస్ ప్రతినిధులు లయన్స్ క్లబ్ ప్రతినిధులు, ఆటో యూనియన్ పెయింటర్స్ అసోసియేషన్ హమాలి సంఘంతో పాటు పలు సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని అదేవిధంగా ముదిరాజ్ సంఘం, బీసీ సంఘాలు లారీ అసోసియేషన్, హమాలి సంఘం, ఆటో యూనియన్ ప్రతినిధులు రిటైర్డ్ ఉద్యోగులు, ప్రతి ఒక్క అర్బన్ బ్యాంకు మెంబర్ పెద్ద ఎత్తున ముందుకు వచ్చి తమ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారని తెలిపారు. మా ప్యానల్ కు మద్దతిస్తున్న వీరందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు.. తెలుపుతున్నాను అని పేర్కొన్నారు.
మేనిఫెస్టో ఐదు గ్యారంటీలు..
వివిధ సంఘాల ప్రతినిధులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసి లు అన్ని వర్గాల ప్రజలు ముస్లిం మైనార్టీల సహకారంతో గెలుపు బాటలో పయనిస్తున్నామన్నారు. 100కు 100% మంచి మెజార్టీతో గెలవబోతున్నామని రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. అర్బన్ బ్యాంకులో రాజకీయ జోక్యం లేకుండా పాలన సాగిస్తామనీ, రాజకీయాలకు ప్రవేశం లేకుండా చేస్తామన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుదాం. బ్యాంకులో రాజకీయాలకు తావులేదు. ఆ విధంగా కఠినంగా వ్యవహరిస్తాం అని స్పష్టం చేశారు.
బ్యాంకులో డిజిటల్ సేవలందిస్తాం బ్యాంకులో అన్ని విభాగాలను ఆధునీకరించి సిబ్బంది మర్యాదపూర్వకంగా ఖాతాదారులతో వ్యవహరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. రుణాలు ఇతర పనులు వినియోగదారులకు తక్షణమే అందేలా ఒక ప్రణాళికను రూపొందిస్తాం. వినియోగదారుల విశ్వాసమే రక్షణ లక్ష్యంగా పనిచేస్తాం అని చెప్పారు. సమావేశంలో అర్బన్ బ్యాంకు ప్యానల్ అభ్యర్థులు మూల వెంకట రవీందర్ రెడ్డి, ఇ లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉయ్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, మన్నె అనంత రాజు, మునిఫల్లి ఫణిత, దామెర శ్రీలత రెడ్డి కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున రాజేందర్, ఆకుల నరసన్న, కొత్తపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంజాల స్వామి గౌడ్, అనంతుల రమేష్, బట్టు వరప్రసాద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.