calender_icon.png 1 June, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

30-05-2025 06:35:14 PM

ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్ నాయక్ 

మహబూబాబాద్,(విజయక్రాంతి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, పేదలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్నమైన పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్(MLA Dr. Jatoth Ramachandra Nayak) అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను, గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను, ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను చేయడానికి కృషి చేస్తుందని, గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఆర్థికంగా లోటు ఏర్పడి సంక్షేమ కార్యక్రమాల అమలుకు కొంత ఆలస్యం జరిగిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇచ్చిన మాట తప్పకుండా పేదలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతుందని చెప్పారు. ఇందిరమ్మ పథకంలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టుకునే విధంగా లబ్ధిదారులు కృషి చేయాలని, ఇందిరమ్మ యాప్ ద్వారా నిర్దేశించిన విధంగానే ఇల్లు కట్టుకుంటే అప్పు చేయాల్సిన పని ఉండదని చెప్పారు.

ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి ముందుగా అవసరమైతే డ్వాక్రా సంఘం నుంచి, బ్యాంకు నుండి రుణం ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ పథకంలో ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారులు వెంటనే గృహ నిర్మాణాన్ని చేపట్టాలని, జాప్యం చేస్తే రద్దు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన నిలువ నీడలేని పేదలందరికీ దశలవారీగా ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని, ఎవరు కూడా నిరాశ చెందవద్దని ఎమ్మెల్యే చెప్పారు. కొద్ది రోజుల్లో రెండవ దశ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.