గాయపడిన పశ్చిమబెంగాల్ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండల పరిధిలోని వెలిమినేడు గ్రామ శివారులో నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి గాయపడిన పశ్చిమ బెంగాల్ కు చెందిన కూలీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, దక్షిణ దినాజ్పూర్ జిల్లా, రామచంద్రపూర్ గ్రామానికి చెందిన నారాయణ చంద్ర రాయ్ (43) గత రెండు నెలలుగా వెలిమినేడు శివారులోని శ్రీ లక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీలో గోడ నిర్మాణ పనులు చేస్తున్నారు.
ఈ నెల 13వ తేదీన తోటి కూలీలతో కలిసి సుమారు 12 అడుగుల ఎత్తులో తడకలపై నిలబడి పని చేస్తుండగా, ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ క్రమంలో కింద ఉన్న ఐరన్ రాడ్ అతని తలకు బలంగా గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది అని, తీవ్రంగా గాయపడిన నారాయణ చంద్ర రాయ్ను వెంటనే నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన, పరిస్థితి విషమించడంతో మార్చి 17చికిత్స పొందుతూ మరణించాడు అని తెలిపారు. ఈ ఘటనపై మృతుని బావ నితిన్ సర్కార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం నిర్వహించి, దర్యాప్తు చేపట్టినట్లు చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.




