calender_icon.png 19 June, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్ట ట్రస్ట్ బోర్డు ఏది?

19-06-2025 01:41:01 AM

అసెంబ్లీలో బిల్లు ఆమోదించి వందరోజులు

  1. --  10 నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై రాజకీయ ఒత్తిళ్లు
  2. ఎవరికి వారు లాబీయింగ్‌లు.. ఎటూ తేల్చలేకపోతున్న సర్కార్
  3. స్థానిక సంస్థల ఎన్నికలొస్తే కోడ్ అడ్డంకి..
  4. మళ్లీ మూడు నెలల వరకు అమలులో కోడ్

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థలు ఎండోమెంట్స్ (సవరణ) బిల్లును 2025 ను ఆమోదించి 100 రోజులు దాటుతున్నది. మార్చి 18న అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. అయినప్పటికీ.. భక్తులు ఆసక్తి గా ఎదురుచూస్తున్న యాదగిరిగుట్ట ఆల య ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బోర్డు సభ్యుల ఎంపిక ఒక కొలిక్కి రావడం లేదని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డు తరహాలో తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి సైతం ప్రత్యే క ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని భావించింది. ఆలయ పాలనా వ్యవహారాలను సమర్థంగా నిర్వహించేందుకు అసెం బ్లీలో బిల్లు పెట్టింది.

తద్వారా పాలకమండలి ఏర్పాటు చేయాలనే సంకల్పాన్ని తల పెట్టింది. ఏటా యాత్రికుల సంఖ్య పెరుగుతుండటం, రోజుకు  కనీసం 50,000 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తుండటంతో.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు బోర్డు అవసరమని గుర్తించింది.

ట్రస్ట్ కూర్పు ఇలా..

రాష్ట్రప్రభుత్వం సవరించిన చట్టం ప్రకారం.. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో 18 మంది సభ్యులు ఉంటారు. బోర్డులో చైర్మన్‌తో సహా 10 మంది నామినేట్ చేయబడిన సభ్యులు, ఒక వ్యవస్థాపక ట్రస్టీ, ఏడు గురు ఎక్స్-అఫిషియో ప్రభుత్వ అధికారులు ఉంటారు. సభ్యులందరూ హిందువులై ఉండా లి. 10 నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వం సా మాజిక సమతుల్యతను పాటించాలని నిర్ణయించింది.

ఈ కూర్పులో ఒక శాసనసభ్యుడు లేదా శాసన మండలి సభ్యుడు, ఒక మహిళ, ఒక బీసీ, ఒక ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులకు ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ 10 మంది సభ్యుల నామినేటెడ్ ప్రక్రియ ఇప్పుడు రాజకీయంగా జటిలంగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎవరికి వారు తమ వర్గానికి చెందిన వారికి పదవులు ఇప్పటించుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సూర్యాపేట అసెంబ్లీ స్థానం తప్ప.. మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రులుగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఈ ఉమ్మడి జిల్లా నుంచే ఉన్నారు.

వీరంతా ఇప్పటికే యాదగిరిగుట్ట బోర్డులో నామినేటెడ్ పదవులకు కొన్ని పేర్లు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఆ సిఫార్సుల్లో ఎవరికి పదవి ఇవ్వాలనేది ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొం డా సురేఖకు తలకు మించిన భారంగా పరిణమించిందని తెలిసింది. ప్రజాప్రతినిధుల సిఫా ర్సులను పరిగణలోకి తీసుకుంటూనే ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్, సీఎస్‌ఆర్ నిధుల వినియోగంపై అనుభవం ఉన్న వ్యాపారులు, దాతలకూ బోర్డులో చోటు కల్పించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలసింది.

కూర్పుపై ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం రాకపోతే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకంటే ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే, ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అలా మూడు, నాలుగు నెలల వరకు బోర్డు ఏర్పాటు వాయిదా పడే అవకాశాలున్నాయి. 

ఏడాదికి రూ.224 కోట్ల ఆదాయం..

యాదగిరిగుట్ట దేవస్థానం 2023 24లో రూ.224 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. సాధారణంగా సాలీన రూ.100 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాలకు ట్రస్ట్ బోర్డు ఏ ర్పాటు చేస్తే బహుళ ప్రయోజనాలు ఉంటా యి. యాదగిరి గుట్ట రూ.100 కోట్ల పరిమితిని మించడంతో ట్రస్ట్ బోర్డు అనివార్యమైంది. ఆలాగే వేములవాడలోని రాజరాజేశ్వరాలయ సాలీన ఆదాయం రూ.187 కోట్లు.

ఈ ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరగుతూ వస్తున్నది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అందుకు తగిన విధంగా భక్తులకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అన్ని స్వయంగా సర్కారే చేపట్టడం కష్టతరం కాబట్టి, ఒక బలమైన ట్రస్ట్ బోర్డు అవసరమని బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ఎండోమెంట్ మంత్రి సురేఖ ప్రస్తావించారు.

దీనికి తోడు ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటూ మహిళలు పెద్ద సంఖ్యలో యాదగిరి గుట్టకు వస్తున్నారని, అలాక్కూడా భక్తుల రద్దీ పెరగుతున్నదని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో అనుభవజ్ఞులు, దార్శనికత కలిగిన సభ్యులతో కూడిన బోర్డు ఏర్పాటు చేస్తే ఆలయ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని, బోర్డు భక్తులకు మెరుగైన సౌకర్యాలు సైతం కల్పించగలుగుతుందని అభిప్రాయపడ్డారు.

18 మంది సభ్యులతో బోర్డు కూర్పు.. 

ఒక చైైర్మన్: ప్రభుత్వం నియమించిన చైైర్మన్ ట్రస్ట్ బోర్డుకు నాయకత్వం వహిస్తారు.

ఒక వ్యవస్థాపక ట్రస్టీ: ఓటు హక్కుతో పూర్తిస్థాయి సభ్యుడిగా వ్యవహరిస్తారు.

ప్రభుత్వం నియమించిన తొమ్మిది మంది నామినేటెడ్ సభ్యులు

* శాసనసభ నుంచి కనీసం ఒక సభ్యుడికి తక్కువ కాకుండా సభ్యత్వం

* ఒక షెడ్యూల్డ్ కుల ప్రతినిధి (ఎస్సీ)

* ఒక వెనుకబడిన వర్గాల ప్రతినిధి (బీసీ)

* ఒక మహిళా ప్రతినిధి

ఏడుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు 

(అధికారిక పదవుల కారణంగా బోర్డులో సభ్యత్వం)

* ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సెక్రటరీ, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ (ఎండోమెంట్స్)

* ఎండోమెంట్స్ కమిషనర్

* ఆలయ కార్యనిర్వాహక అధికారి -సభ్య-కార్యదర్శిగా కూడా పనిచేస్తారు

* వైస్ చైర్మన్, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీ (వైటీడీఏ)

* స్థానాచార్య (ప్రధాన పూజారి) - లేదా ఆయన లేనప్పుడు, అనుభవజ్ఞలైన ప్రధాన అర్చకుడు

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - రెండేళ్ల ప్రారంభ కాలం

* కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా - ఐదు సంవత్సరాల ప్రారంభ కాలం